అక్షరటుడే, వెబ్డెస్క్: KTR | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మంత్రుల ఫోన్లు ట్యాప్ (Phone Tapping) చేయిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి సీటుకు ఎసరు పెడుతున్నారని.. మంత్రులు భట్టి, పొంగులేటి, ఉత్తమ్(Uttam) ఫోన్లు ట్యాప్ చేయించడం లేదా? అని ప్రశ్నించారు. దమ్ముంటే రేవంత్రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. త్వరలోనే ఆధారాలతో సహా అన్నీ బయటపెడతానన్నారు.
ఖమ్మం జిల్లాలో శుక్రవారం పర్యటించిన కేటీఆర్ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ (Former Minister Puvvada Ajay) నివాసంలో నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కారుపై నిప్పులు చెరిగారు. ఓటేసిన పాపానికి కాంగ్రెస్ కాటేస్తున్నదని ప్రజలు బాధపడుతున్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు.
KTR | కాంగ్రెస్ చెప్పిన మార్పు ఇదేనేమో..?
కాంగ్రెస్ పార్టీ (Congress Party) చెప్పిన మార్పు అంటే ఏమిటో ప్రజలకు ఇప్పుడు అర్థమైందన్నారు. రైతులు ఎరువులు, విత్తనాల కోసం, నీళ్ల కోసం రోడ్లెక్కుతున్నారని, కాంగ్రెస్ చెప్పిన మార్పు అంటే ఇదేనేమోనని ఎద్దేవా చేశారు. కొత్త ఒక వింత, పాత ఒక రోత అనే చందంగా ప్రజలకు మనపై బోర్ కొట్టిందన్నారు. కాంగ్రెస్ నేతలు(Congress Leaders) మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజలను వంచించారని మండిపడ్డారు.
రైతు డిక్లరేషన్ , రెండు లక్షల ఉద్యోగాలు, స్కూటీలు, నిరుద్యోగ భృతి, తులం బంగారం వంటి బోగస్ హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. చివరకు వృద్ధులు, బలహీన వర్గాలను కూడా కాంగ్రెస్ నేతలు మోసం చేశారని ధ్వజమెత్తారు. ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు జరిగితే కేసీఆర్ 100 సీట్లలో ఏకపక్షంగా గెలుస్తారని జోస్యం చెప్పారు. కొత్త రాష్ట్రం తెలంగాణను నిర్మాణాత్మకంగా, ప్రణాళిక బద్దంగా కేసీఆర్ (KCR) పదేళ్ల పాలనలో అభివృద్ధి చేశారని కేటీఆర్ ఉద్ఘాటించారు. కేసీఆర్ హయాంలో తెంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు.
KTR | అంబేద్కర్ ఊహించలేదు..
మోసపూరిత మాటలతో కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిందని కేటీఆర్(KTR) విమర్శించారు. ఏడాదిన్నర పాలనలో ఏ ఒక్క హామీని కూడా సంపూర్ణంగా అమలు చేయలేదని ఆరోపించారు. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చారని, వాటిని నమ్మి జనం ఓట్లేసి గెలిపించారన్నారు. కానీ కాంగ్రెస్ వైఖరి ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమవుతుందని తెలిపారు. రైతులకు బోగస్ మాటలు చెప్పి మోసం చేశారన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి యువతను మోసం చేశారన్నారు.
రూ.4 వేల పెన్షన్ ఇస్తామని చెప్పి వయోవృద్ధులను, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల (BC Reservations) పేరుతో మోసం చేశారని మండిపడ్డారు. పాపం అంబేద్కర్.. ఇంత దగుల్బాజీ నాయకులు రాష్ట్రాన్ని పరిపాలిస్తారని ఊహించలేదని విమర్శించారు. లేకపోతే రాజ్యాంగంలో రీకాల్ వ్యవస్థను పెట్టేవారని తెలిపారు. కొన్ని దేశాల్లో రీకాల్ వ్యవస్థ ఉందన్న కేటీఆర్.. పాలకులు నచ్చకపోతే గద్దెనుంచి దింపే అవకాశం ప్రజలకు ఉంటుందన్నారు.
KTR | మంత్రులపై సెటైర్లు
ఖమ్మం జిల్లా మంత్రులపై కేటీఆర్ సెటైర్లు వేశారు. ముగ్గురు మంత్రులు ఉండి కూడా ఖమ్మం జిల్లాకు ఏం చేయడం లేదని విమర్శించారు. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ముగ్గురు మొనగాళ్లలా తిరుగుతున్నారన్నారు. ఒకాయన బాంబుల మంత్రి ఆయన బాంబులు పేలటం లేదని ఎద్దేవా చేశారు. ఆ మంత్రి బాంబులు.. బాంబులంటూ పేలని.. బాంబులు పట్టుకుని తిరుగుతున్నారని దెప్పిపొడిచారు. దీపావళి నుంచి బాంబులు పెలతాయని అంటూనే ఉన్నారు. అవి ఇప్పటికీ పేలింది లేదని ఎద్దేవా చేశారు. ఆయన ఇంటి పేరు పొంగులేటి(Ponguleti) కాదు బాంబులేటి అయిందని విమర్శించారు.
మరొక మంత్రి కమీషన్ల చుట్టూ తిరుగుతున్నారని.. ఆయన కమీషన్లు తీసుకోవడంలో బిజీగా ఉన్నాడని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka)పై విమర్శలు చేశారు. ఇంకొకాయన వ్యవసాయ మంత్రి ఏం చేస్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎరువుల కొరత వచ్చిందని.. కాంగ్రెస్ పుణ్యాన మళ్లీ పాత రోజులు వచ్చాయని రైతులు (Farmers) పాటలు పాడుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. ఎరువుల దుకాణాల ముందు చెప్పులు, ఆధార్ కార్డులు పెడితే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల (Agriculture Minister Tummala) ఏం చేస్తున్నాడు అని ప్రశ్నించారు.
KTR | స్థానిక పోరులో సత్తా చాటాలి..
స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local Body Elections) బీఆర్ఎస్ అత్యధిక స్థానాల్లో గెలవాలని కేటీఆర్ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఒక్కొక్కరూ ఒక్కో కేసీఆర్లా గ్రామాల్లో పని చేయాలని సూచించారు.