అక్షరటుడే, వెబ్డెస్క్ : Ibrahimpatnam | మద్యం మత్తులో వాహనం నడుపుతూ పట్టుబడితే జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంతో ఓ వ్యక్తి చేసిన అఘాయిత్యం యాచారంలో కలకలం రేపింది. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఏకంగా విధి నిర్వహణలో ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ను ఢీకొన్నాడు.
ఎస్సై కారు బోనెట్పై ఉన్నాడన్న విషయాన్ని కూడా లెక్కచేయకుండా సుమారు అర కిలోమీటరు దూరం అత్యంత వేగంగా కారును నడిపి అందరినీ భయాందోళనకు గురిచేశాడు.రంగారెడ్డి జిల్లా యాచారం పోలీస్ స్టేషన్ (Yacharam Police Station) పరిధిలో ఆదివారం రాత్రి ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… యాచారం ఎస్సై మధు తన సిబ్బందితో కలిసి స్థానిక బస్టాండ్ సమీపంలో డ్రంకెన్ డ్రైవ్ (Drunken Drive) తనిఖీలు నిర్వహిస్తున్నారు.
Ibrahimpatnam | నిందితుడి అరెస్ట్
అతివేగంగా దూసుకొచ్చిన ఓ కారును ఆపాలని పోలీసులు సంకేతాలు ఇచ్చారు. అయితే డ్రైవర్ పోలీసులను బేఖాతరు చేస్తూ ముందుకు దూసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఎస్సై మధు (SI Madhu) కారును అడ్డుకునే ప్రయత్నంలో బోనెట్పైకి ఎక్కారు. అయినప్పటికీ డ్రైవర్ కారు ఆపకపోగా, ఆయన బోనెట్పై ఉండగానే వాహనాన్ని వేగంగా ముందుకు పోనిచ్చాడు. ఈ ఘటనను చూసిన స్థానికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. పారిపోతున్న క్రమంలో ఆ కారు ద్విచక్రవాహనంపై వెళ్తున్న వెంకట్రెడ్డి, ఆయన కోడలు దివ్య, వారి ఏడాది వయసున్న మనవడిని బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో బైక్పై ఉన్నవారు రోడ్డుపై పడిపోగా, దివ్య చేయి విరిగింది. వెంకట్రెడ్డి, చిన్నారికి స్వల్ప గాయాలు అయ్యాయి. బాధితులను వెంటనే ఆస్పత్రికి తరలించారు.
పట్టణం దాటిన తర్వాత కారు వేగం కొద్దిగా తగ్గడంతో ఎస్సై మధు అప్రమత్తతతో బోనెట్ నుంచి రోడ్డు పక్కకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ ఘటనలో ఆయనకూ స్వల్ప గాయాలు అయ్యాయి. ఘటన అనంతరం అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని వెంబడించి ఇబ్రహీంపట్నం సమీపంలోని ఖానాపూర్ (Khanapur) వద్ద అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని కోహెడకు చెందిన శ్రీకర్గా గుర్తించారు. బ్రీత్ అనలైజర్ పరీక్షలో అతను మద్యం సేవించినట్లు నిర్ధారణ అయ్యింది. కారులో శ్రీకర్తో పాటు అతని స్నేహితుడు నితిన్ కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.