అక్షరటుడే, వెబ్డెస్క్ : CM Chandrababu | ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటు దిశగా కూటమి ప్రభుత్వం వేగం పెంచింది. జిల్లాల పునర్విభజనపై స్పష్టత రావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు కీలక సమావేశం నిర్వహించనున్నారు.
ఈ సమావేశంలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు, సరిహద్దుల మార్పులపై చర్చ జరగనుంది. ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం పలు సూచనలు సమర్పించింది. ఎన్నికల సమయంలో మార్కాపురంను (Markapuram) ప్రత్యేక జిల్లాగా చేస్తామని సీఎం చంద్రబాబు (CM Chandrababu) హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ దిశగా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. తాజా సమాచారం ప్రకారం.. రంపచోడవరం, పలాస, మార్కాపురం, గూడూరు, మదనపల్లె, అమరావతి కొత్త జిల్లాలుగా అవతరించే అవకాశం ఉంది.
CM Chandrababu | డిసెంబర్ 31లోగా పూర్తి లక్ష్యం
ప్రభుత్వం ఈ ఏడాది డిసెంబర్ 31లోగా కొత్త జిల్లాల పునర్విభజన ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 26 జిల్లాలు ఉన్న నేపథ్యంలో, వాటిని 32 జిల్లాలుగా విస్తరించే యోచనలో ఉంది. కొత్త జిల్లాల సరిహద్దులు, పేర్లు, కేంద్రాలపై తుది నిర్ణయం త్వరలో తీసుకోనుంది. రాజకీయ వర్గాల ప్రకారం.. ఆరు కొత్త జిల్లాల రూపకల్పనపై చర్చ నడుస్తోంది. వాటిలో పలాస (శ్రీకాకుళం జిల్లా నుంచి), మార్కాపురం, మదనపల్లె, గూడూరు, రాజంపేట, అమరావతి (Amaravati) పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. భౌగోళిక విస్తీర్ణం, జిల్లా కేంద్రాల దూరం, పరిపాలనా సౌలభ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ ఈ మార్పులు జరిగే అవకాశముంది.
త్వరలో జరగనున్న జనగణన దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని త్వరగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. 2026 జనవరి 1 నుంచి 2027 మార్చి 31 వరకు జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దులు లేదా పేర్ల మార్పులు చేయడానికి అవకాశం ఉండదు. అందుకే డిసెంబర్ 31లోగానే కొత్త జిల్లాల అమలు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కొత్త జిల్లాలను 2026 జనవరి 26 నుంచి అమల్లోకి తేనున్నారని చెబుతున్నారు. మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ఆధారంగా కేబినెట్లో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. కొత్త జిల్లాలు ఏర్పాటయ్యే సరికి ఏపీలో జిల్లాల సంఖ్య 32కు చేరనుంది. తెలంగాణలో 33 జిల్లాలు ఉన్న నేపథ్యంలో, జనాభా పరంగా పెద్దదైన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కూడా సమతౌల్యంగా పరిపాలన కొనసాగించేందుకు ఈ నిర్ణయం కీలకంగా మారనుంది.
