అక్షరటుడే, ఆర్మూర్: PDSU Armoor | విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ (Fee reimbursement) బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యూ ఆధ్వర్యంలో ఈనెల 28న ‘చలో సబ్ కలెక్టర్ ఆఫీస్ ముట్టడి’ నిర్వహించనున్నట్లు ఆర్గనైజేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు అనిల్కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం సంస్థ కార్యాలయంలో మాట్లాడారు.
పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ (Scholarships), రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని ఏళ్లుగా విద్యార్థుల కోరుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. విద్యార్థులతో పాటు విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, విద్యాసంస్థల యాజమాన్యాలు సైతం ఆందోళనలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదన్నారు.
పేద విద్యార్థులపై ఆర్థిక భారం పడుతోందని.. ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రైవేట్ కళాశాలలు సైతం నిర్వహణ తమవల్ల కావట్లేదని బంద్ పాటిస్తున్నాయని.. ప్రస్తుతం విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షల సమయమని.. వారు చదువుపరంగా ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు.
ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈనెల 28న చేపట్టబోయే ఆర్మూర్ సబ్ కలెక్టర్ (Armoor Sub-Collector) ఆఫీస్ ముట్టడికి విద్యార్థులు తరలిరావాలని వారు కోరారు. కార్యక్రమంలో పీడీఎస్యూ ఏరియా అధ్యక్షుడు నిఖిల్, నాయకులు వివేక్ , ఖుషి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
