Homeఅంతర్జాతీయంPakistan - Afganistan | పాక్-అఫ్గాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం

Pakistan – Afganistan | పాక్-అఫ్గాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం

పాకిస్థాన్​–అఫ్గానిస్థాన్​ మధ్య శాంతి చర్చలు సఫలం అయ్యాయి. ఇరుదేశాలు తక్షణ కాల్పుల విరమణకు అంగీకారం తెలిపాయి.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Pakistan – Afganistan | కొంతకాలంగా దాడులు, ప్రతిదాడులతో అట్టుడుకున్న పాకిస్థాన్​– అఫ్గానిస్థాన్​ (Pak – Afghan) మధ్య ఎట్టకేలకు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. రెండు దేశాల మధ్య శాంతి చర్చలు ఫలించాయి. పాక్​- అఫ్గాన్​ మధ్య దోహ వేదికగా శాంతి చర్చలు జరిగాయి.

ఈ చర్చల్లో తక్షణ కాల్పుల విరమణకు రెండు దేశాలు అంగీకరించాయి. ఖతార్‌, తుర్కియే (Qatar and Turkey) మధ్యవర్తిత్వంతో చర్చలు జరిగాయి. ఈ మేరకు ఖతార్‌ విదేశాంగ మంత్రిత్వశాఖ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు ప్రకటించింది. రెండు విడతల్లో జరిగిన చర్చల్లో శాంతి, స్థిరత్వం కోసం కాల్పుల విరమణకు అంగీకరించాయని తెలిపింది. ఈ చర్చల్లో పాక్​, అఫ్గాన్​ రక్షణ మంత్రులు పాల్గొన్నారు.

Pakistan – Afganistan | అప్పటి నుంచి..

అమెరికా బలగాలు వైదొలిగిన తర్వాత 2021లో అఫ్గానిస్థాన్​లో తాలిబన్లు అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అప్పటి నుంచి పాక్​, అఫ్గాన్​ మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఇటీవల దాడులు పెరిగాయి. పాకిస్థాన్​ మొదట కాబూల్​పై వైమానిక దాడులు (airstrikes) చేపట్టింది. అనంతరం అఫ్గాన్​ ప్రతిదాడులు చేసింది. పలు పాక్​ సైనిక పోస్టులను స్వాధీనం చేసుకుంది. దీంతో పాకిస్థాన్​ వైమానిక దాడులు చేపట్టగా.. ఇటీవల అఫ్గాన్​ క్రికెటర్లు సహా 8 మంది చనిపోయారు. ఈ క్రమంలో రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. అక్టోబర్ 25న ఇస్తాంబుల్‌లో మళ్లీ సమావేశం ఉంటుందని ఖతార్​ విదేశాంగ శాఖ తెలిపింది.

కాగా శుక్రవారం సరిహద్దు సమీపంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో ఏడుగురు పాకిస్తాన్ సైనికులు (Pakistan Army) మరణించగా, 13 మంది గాయపడ్డారని భద్రతా అధికారులు తెలిపారు. తమ​పై దాడులు చేపడుతున్న ఉగ్రవాదులకు అఫ్గానిస్థాన్​ ఆశ్రయం కల్పిస్తోందని పాక్​ ఆరోపిస్తుంది. అయితే వీటిని తాలిబన్లు ఖండిస్తున్నారు.