అక్షరటుడే, వెబ్డెస్క్ : CBI Case | న్యాయవాదులు వామనరావు దంపతుల హత్యపై సీబీఐ కేసు నమోదు చేసింది. వామనరావు, ఆయన భార్యను కొందరు నడిరోడ్డుపై హత్య చేసిన విషయం తెలిసిందే.
పెద్దపల్లి జిల్లా(Peddapalli District)లోని రామగిరి మండలం కాల్వచర్ల వద్ద 2021 ఫిబ్రవరి 17న న్యాయవాదులు గట్టు వామన్రావు, నాగమణి దంపతులను దుండగులు హత్య చేశారు. కారులో వెళ్తున్న వారిని వెంబడించి కత్తులతో పొడిచి చంపారు. పట్టపగలు ఇద్దరు హైకోర్టు న్యాయవాదులను హత్య చేయడం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ కేసులో ఇప్పటి వరకు నిందితులకు శిక్ష పడలేదు. ఈ క్రమంలో తాజాగా సీబీఐ కేసు(CBI Case) నమోదు చేయడం గమనార్హం.
CBI Case | సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో..
వామనరావు దంపతుల హత్య కేసు విచారణ సక్రమంగా జరగడం లేదని, సీబీఐకి అప్పగించాలని వామనరావు తండ్రి కిషన్ రావు సుప్రీంకోర్టు(Supreme Court)లో పిటిషన్ వేశారు. జస్టిస్ సుందరేశ్ , జస్టిస్ ఎన్ కె సింగ్ ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయగా.. ఈ కేసును సీబీఐకి అప్పగించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రభుత్వం తెలిపింది. దీంతో కేసును సీబీఐకి అప్పగించాలని గత నెల 12న సుప్రీంకోర్టు ఆదేశించింది.
CBI Case | సుప్రీం ఆదేశాలతో..
వామనరావు దంపతుల హత్యపై 2021 ఫిబ్రవరి 17న రామగిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్లో వసంతరావు, కుంట శ్రీనివాస్, కుమార్ పేర్లు ఉన్నాయి. అయితే సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు తాజాగా సీబీఐ కేసు నమోదు చేసింది. 120B, 341, 302, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొంది. గతంలో కేసు నమోదైన నిందితులపై కేసు రీ రిజిస్టర్ చేసి విచారణ చేపడుతున్నట్లు సీబీఐ తెలిపింది. ఇన్స్పెక్టర్ విపిన్ గహలోత్(Inspector Vipin Gehlot) ఈ కేసు దర్యాప్తు అధికారిగా ఉండనున్నారు. పాత నిందితులను మళ్లీ అరెస్ట్ చేయొద్దని సుప్రీంకోర్టు సీబీఐకి సూచించింది.