అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Raging in Medical College | ర్యాగింగ్కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitanya) హెచ్చరించారు. నగరంలోని వీక్లీ మార్కెట్ లో నివాసముంటున్న నిజామాబాద్ మెడికల్ కాలేజీ (Medical College) విద్యార్థి రాహుల్ రెడ్డిని ర్యాగింగ్ చేసిన పలువురిపై పోలీసులు ఆదివారం వన్టౌన్ ఠాణాలో కేసు నమోదు చేశారు.
పటాన్చెరుకు చెందిన రాహుల్ రెడ్డి ప్రస్తుతం కాలేజీలో నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. ఇంటర్నల్ డ్యూటీలో భాగంగా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో విధులు నిర్వర్తించాడు. అయితే రాహుల్ విధులకు గైర్హాజరైనట్లు సీనియర్ అయిన సాయిరాం పవన్ రిజిస్టర్లో నమోదు చేశాడు. దీనిపై ప్రశ్నించడంతో బెదిరింపులకు పాల్పడ్డాడు. అంతేగాకుండా శనివారం సాయంత్రం మాట్లాడుదామని పిలిపించి దాడి చేశాడు. సుమారు 15 మంది రాహుల్ను ర్యాగింగ్ చేయడంతో పాటు బెదిరించారు. సాయిరాం, పవన్, శ్రావణ్, సాత్విక్ హృదయ పాల్, అభినవ్ పెద్ది, ఆదిత్య దాడికి పాల్పడ్డారు. ఈ మేరకు బాధిత విద్యార్థి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Raging in Medical College | కఠిన చర్యలు
పాఠశాలలు, కాలేజీల్లో ర్యాగింగ్కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ సాయి చైతన్య హెచ్చరించారు. విద్యాసంస్థల పరిధిలో శాంతి భద్రతలకు భంగం కలిగించేలా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా ర్యాగింగ్ చేస్తున్నట్లు తెలిసినా, గమనించినా వెంటనే డయల్ 100, పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 8712659700 ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని సీపీ తెలిపారు.