అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP | ఫేక్ ఐడీ కార్డులు (Fake ID cards), ఆర్సీలతో కార్లను అమ్ముతూ తిరిగి వాటిని చోరీ చేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు కామారెడ్డి పోలీసులు (Kamareddy polioce). జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chadra) బుధవారం వివరాలను వెల్లడించారు.
ఫేస్బుక్ అప్లికేషన్ (Facebook) ద్వారా వ్యక్తులు కారుకొన్న తర్వాత ‘‘ఆ కారు మాది.. మీరెలా కొనుక్కుంటారు’’ అంటూ కొందరు వ్యక్తులు కారును ఎత్తుకెళ్లిన కేసు మాచారెడ్డి పోలీస్ స్టేషన్లో (Macha reddy Police station) జూలై 1న నమోదైంది. విచారణ ప్రారంభించిన పోలీసులకు పలు విస్తుపోయే విషయాలు తెలిశాయి.
కారును సెల్ఫ్ డ్రైవింగ్ (Self Driving) కోసమని అద్దెకు తీసుకునే ఏడుగురు సభ్యులతో ఉన్న ముఠా కారుకు ఫేక్ నంబర్ప్లేట్ ఫేక్ ఆర్సీ (RC) తయారు చేస్తారు. అనంతరం ఆన్లైన్లో ఎంప్టీ చిప్స్ కొనుగోలు చేసి వాటికి ప్రింట్ తయారు చేసుకుని ఫేక్ ఐడీ కార్డులు తయారు చేస్తారు. ఫేక్ ఆర్సీ తయారు చేసి ఫేస్బుక్లో పెట్టి ఆ కారును అమ్మేస్తారు.
అదే కారుకు ఆన్లైన్లో కొనుగోలు చేసిన జీపీఎస్ ట్రాకర్ను (GPS Tracker) అమర్చుతారు. రెండు రోజుల తర్వాత జీపీఎస్ ట్రాకర్ ద్వారా కారు అడ్రస్ తెలుసుకుని ఆ ప్రాంతానికి కొత్త వ్యక్తిని పంపుతారు. ఆ వ్యక్తి కారు కొన్న యజమానిని బెదిరిస్తాడు. ఆ కారు తనదని.. మీరెలా కొంటారు.. పోలీసు కేసు పెడతామంటూ బెదిరించి.. డుబ్లికేట్ కీ ద్వారా కారు తీసుకుని పరారవుతారు. తిరిగి ఎక్కడైతే కారును అద్దెకు తీసుకున్నారో అక్కడ కారును తిరిగి అప్పగిస్తారు.
ఇలా కారు పేరుతో వ్యక్తులను మోసం చేస్తున్న ముఠా కోసం పోలీసులు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. అయితే తమను వెతుకుతున్నారనే విషయం తెలుసుకున్న ఏడుగురు ముఠా సభ్యులు శేరి లింగంపల్లి (Sheri Lingampally) పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ ప్రాంతంలో తలదాచుకున్నారు. పోలీసులు పక్కా సమాచారంతో ముఠాలో ఆరుగురిని అరెస్ట్ చేశారు. వీరిపై జిల్లాలో ఒకే కేసు నమోదు కాగా.. ఇతర జిల్లాల్లో మరిన్ని చోరీలకు పాల్పడ్డారని ఎస్పీ వివరించారు.
అరెస్టయిన వారిలో రంగారెడ్డి జిల్లా శేరి లింగంపల్లికి చెందిన మహమ్మద్ ఇయాజ్, వికారాబాద్ (Vikarabad) అలంపల్లికి చెందిన మహమ్మద్ జాహిద్ అలీ, సంగారెడ్డి (Sangareddy) జిల్లా రామచంద్రాపురంకు చెందిన పృథ్వీ జగదీష్, వరంగల్ (Warangal) జిల్లా కొత్తవాడకు చెందిన రాచర్ల శివకృష్ణ, రంగారెడ్డి జిల్లా శేరి లింగంపల్లికి చెందిన కర్ణకోట సాకేత్, సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంనకు చెందిన వేములవాడ వివేక్ ఉన్నారు. అలీ అనే వ్యక్తి పరారీలో ఉన్నట్టు తెలిపారు. అరెస్టయిన వారి నుంచి ఇన్నోవా, ఎర్టిగా, బెలెనో కార్లు, 15 మొబైల్ ఫోన్, కారు జీపీఎస్ ట్రాకర్, ల్యాప్టాప్, 10 మైక్రో సిమ్ కార్డులు, ఎంప్టీ చిప్ కార్డ్స్, ఫోర్జరీ చేసిన ఆర్సీలు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ తెలిపారు.
సిమ్ కార్డులకు కూడా రిజిస్ట్రేషన్ లేవని, ఈ సిమ్ కార్డులు (Sim cards) ఎక్కడినుంచి వచ్చాయి.. ఎవరు ఇస్తున్నారనే సమాచారాన్ని శోధిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. వీరికి తెర వెనుక సహకరిస్తున్నదెవరు..? వీరి ముఠాలో ఇంకెవరైనా ఉన్నారా అనే దానిపై వివరాలు సేకరించేందుకు నిందితులను కస్టడీకి తీసుకుని విచారణ చేస్తామన్నారు.
అరెస్టయిన వారిపై గతంలో శంకర్ పల్లి, మంచాల, అంబార్ పేట, రామచంద్రాపురం, చందానగర్, మియాపూర్, అత్తాపూర్ పోలీస్ స్టేషన్లలో 8 కేసులు నమోదై ఉన్నాయని తెలిపారు. ముఠా అరెస్టులో చురుగ్గా పనిచేసిన రూరల్ సీఐ రామన్, మాచారెడ్డి ఎస్సై అనిల్, కానిస్టేబుళ్లు సుభాష్ రెడ్డి, శ్రీకాంత్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. సమావేశంలో కామారెడ్డి సబ్డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి, సీఐ రామన్, ఎస్సై అనిల్, సిబ్బంది పాల్గొన్నారు.
పోలీసులు స్వాధీనం చేసుకున్న కార్లు