అక్షరటుడే, వెబ్డెస్క్ : Nalgonda | తెలంగాణలోని (Telangana) నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి వద్ద ఈ ఉదయం భయానక రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వెళ్తున్న ఓ ఇన్నోవా కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొని బోల్తా పడింది. కొన్ని క్షణాల్లోనే కారులో మంటలు చెలరేగి, వాహనం పూర్తిగా దగ్ధమైంది. అయితే, కారులో ఉన్న ఎనిమిది మంది ప్రయాణికులు సకాలంలో బయటపడడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
Nalgonda | పెను ప్రమాదం..
హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై (National Highway) ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు యూ-టర్న్ తీసుకునే సమయంలో వేగాన్ని నియంత్రించలేక డివైడర్ను ఢీకొట్టింది. ఢీకొన్న ప్రభావానికి కారు రోడ్డుపైనే పల్టీలు కొట్టి ఆగింది. ఇంజిన్ భాగం నుంచి మంటలు చెలరేగి క్షణాల్లోనే వాహనం మొత్తానికి వ్యాపించాయి. అయితే ప్రయాణికులు అప్రమత్తమై వెంటనే కారులో నుంచి బయటకు దూకి ప్రాణాలు రక్షించుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. కానీ అప్పటికే కారు పూర్తిగా కాలిపోయి బూడిదయిపోయింది. ఈ ఘటన కారణంగా కొంతసేపు హైదరాబాద్–విజయవాడ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ (Heavy Traffic Jam) ఏర్పడింది.
ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అదృష్టవశాత్తు ఎవరికి పెద్దగా గాయాలు కాలేదు. ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రోడ్డు ప్రమాదంతో చిట్యాల (Chityaal) వరకు వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ప్రమాదానికి గురైన కారును పక్కకు తొలగించి పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేశారు. కాగా.. ఇటీవల బస్సు, కారు ప్రమాదాలు జరగడంతో పాటు అవి అగ్నికి ఆహుతి అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రయాణ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
