HomeతెలంగాణHyderabad Metro | నష్టాల మెట్రోను నడపలేం.. కేంద్రానికి ఎల్​అండ్​టీ లేఖ

Hyderabad Metro | నష్టాల మెట్రోను నడపలేం.. కేంద్రానికి ఎల్​అండ్​టీ లేఖ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Metro | హైదరాబాద్​ నగరంలో నిత్యం లక్షలాది మందిని మెట్రో రైళ్లు గమ్యస్థానానికి చేరుస్తున్నాయి. అయితే మెట్రో రైలును (Metro Train) తాము నడపలేమని ఎల్​అండ్​టీ​ కేంద్రానికి లేఖ రాసింది.

పబ్లిక్​ ప్రైవేట్​ భాగస్వామ్య విధానంలో హైదరాబాద్​ నగరంలో ఎల్అండ్​టీ సంస్థ (L&T Company) మెట్రో రైలు నిర్మించింది. అయితే నష్టాలతో నిర్వాహణ తమతో కాదని సంస్థ పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నిర్వహణ బాధ్యతను అప్పగించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ఒకవేళ మెట్రో నిర్వాహణ కోసం స్పెషల్ పర్పస్ వెహికిల్​ను ఏర్పాటు చేసినా తాము అప్పగిస్తామని చెప్పింది. వరుస నష్టాలతో పాటు, పేరుకుపోయిన బకాయిలతో మెట్రోను నడపలేమని తేల్చి చెప్పింది.

Hyderabad Metro | సరిపోని ఆదాయం

హైదరాబాద్​ నగరంలో (Hyderabad City) ప్రస్తుతం మూడు మార్గాల్లో మెట్రో రైళ్లు తిరుగుతున్నాయి. నిత్యం దాదాపు 5 లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారు. అయితే టికెట్లు, యాడ్స్​, లీజు​ల ద్వారా వస్తున్న ఆదాయం సరిపోవడం లేదని ఎల్​అండ్​టీ పేర్కొంది. ఈ ప్రాజెక్టును కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పింది. ఈ మేరకు కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు తాజాగా సదరు సంస్థ లేఖ రాసింది.

Hyderabad Metro | కేంద్రం వివరణ కోరడంతో..

నగరంలో మెట్రో రెండో దశ పనులు వేగంగా చేపడుతున్నాయి. ఇప్పటికే భూ సేకరణ పూర్తి కాగా ఆయా మార్గాల్లో ఉన్న భవనాలను అధికారులు తొలగిస్తున్నారు. ఈ క్రమంలో మెట్రో రెండో దశ డీపీఆర్‌పై రాష్ట్ర ప్రభుత్వం (State Government) నుంచి కేంద్రం ఇటీవల వివరణ కోరింది. ఎల్​అండ్​టీతో చేసుకున్న ఒప్పందాలపై వివరాలు అడిగింది. ఈ క్రమంలో తాజాగా ఎల్‌టీ లేఖ రాయడం గమనార్హం.

Hyderabad Metro | బకాయిలు రూ.ఐదు వేల కోట్లు..

నగరంలో మెట్రో మొదటి దశ పనులు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్​ హయాంలో ప్రారంభం అయ్యాయి. మెట్రో 2017లో ప్రారంభమైంది. 69 కిలోమీటర్ల మేర రూ.22 వేల కోట్లతో మెట్రో రైలు మార్గం నిర్మించారు. ప్రభుత్వం నుంచి ఎల్​అండ్​టీకి రూ.ఐదు వేల కోట్లు బకాయిలు రావాల్సి ఉంది. అంతేగాకుండా టికెట్ల ద్వారా వచ్చే ఆదాయం రైళ్ల నిర్వాహణకు సరిపోవడం లేదని సంస్థ చెబుతోంది. ఈ క్రమంలో మెట్రో నిర్వాహణ బాధ్యతను ఇతరులకు అప్పగిస్తామని ప్రకటించింది.