అక్షరటుడే, వెబ్డెస్క్ : BSNL | ప్రభుత్వ సహకారంతో భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (Bharat Sanchar Nigam Limited) తన సేవలను విస్తరిస్తోంది. ప్రైవేట్ టెలికాం ఆపరేటర్ల(Telecom Operators)కు పోటీ ఇచ్చే దిశగా ఎదుగుతోంది. సెప్టెంబర్లో దేశవ్యాప్తంగా 97,500 కంటే ఎక్కువ సైట్లలో బీఎస్ఎన్ఎల్‘ స్వదేశీ’ 4జీ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే.
దీనికి తోడు తక్కువ ధరల్లో రీచార్జి ప్లాన్ల (Recharge Plans)ను అందుబాటులో ఉంచుతోంది. ఇతర ఆపరేటర్లతో పోల్చితే ఈ ప్లాన్లు చౌకగా ఉండడంతో బీఎస్ఎన్ఎల్లోకి పోర్ట్(Port) అవుతున్నారు. ఈ క్రమంలో బీఎస్ఎన్ఎల్ కస్టమర్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. గతేడాది సెప్టెంబర్లో ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు రీచార్జి ప్లాన్లను గణనీయంగా పెంచిన సమయంలో చాలామంది కస్టమర్లు ఆయా సంస్థలనుంచి భారత్ సంచార్ నిగం లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్)లోకి పోర్ట్ అయిన విషయం తెలిసిందే. అలాగే ఈ ఏడాది ఆగస్టులోనూ కొత్త సబ్స్క్రైబర్లు భారీగా చేరారు. ట్రాయ్(TRAI) నివేదిక ప్రకారం ఆగస్టులో కొత్త సబ్స్క్రైబర్ల చేరికలో బీఎస్ఎన్ఎల్ సంస్థ ఎయిర్టెల్ (Airtel)ను వెనక్కి నెట్టింది. ఆ నెలలో 13.85 లక్షల మంది బీఎస్ఎన్ఎల్ సబ్స్క్రైబర్లుగా మారారు. ఎయిర్టెల్ 4.96 లక్షల మంది కొత్త కస్టమర్లను మాత్రమే జోడిరచింది. ఎప్పటిలాగే 1.9 మిలియన్లకుపైగా కొత్త కస్టమర్లతో జియో అగ్రభాగంలో నిలిచింది. వొడాఫోన్ ఐడియా సంస్థ 3.08 లక్షల మంది కస్టమర్లను కోల్పోయింది. తాజాగా గతనెలకు సంబంధించిన సబ్స్క్రైబర్(Subscriber) డాటా వెల్లడయ్యింది.
BSNL | మొదటి స్థానంలో జియో..
ట్రాయ్ గణాంకాల ప్రకారం సెప్టెంబర్లో రిలయన్స్ జియో(Jio)లో 32.5 లక్షల కొత్త చందాదారులు చేరారు. రెండో స్థానంలో బీఎస్ఎన్ఎల్ (BSNL) నిలిచింది. ప్రభుత్వ రంగ సంస్థలో 5.24 లక్షల కొత్త కస్టమర్లు యాడ్ అయ్యారు. 4.37 లక్షల కొత్త సబ్స్క్రైబర్లతో ఎయిర్టెల్ మూడో స్థానంలో నిలిచింది. ఇక షరా మామూలుగానే వొడాఫోన్ ఐడియా(Vodafone Idea) కస్టమర్లను కోల్పోతూనే ఉంది. గతనెలలోనూ 7.44 లక్షల చందాదారులు వొడోఫోన్ ఐడియాను వీడారు.
దేశంలో టెలికాం సబ్స్క్రైబర్ బేస్ ఆగస్టులో 1,224.54 ఉండగా.. సెప్టెంబర్ నాటికి 1,228.94 మిలియన్లకు చేరింది. 482.70 మిలియన్లతో జియో మొదటి స్థానంలో ఉండగా.. 392.41 మిలియన్లతో ఎయిర్టెల్, 202.81 మిలియన్లతో మూడో స్థానంలో వొడాఫోన్ ఐడియా, 92.27 మిలియన్లతో బీఎస్ఎన్ఎల్ నాలుగో స్థానంలో ఉన్నాయి.

