అక్షరటుడే, వెబ్డెస్క్ : Kavitha Janam Bata | తనతో చాలా మంది బీఆర్ఎస్ (BRS) నేతలు, ఉద్యమకారులు టచ్లో ఉన్నారని తెలంగాణ జాగృతి (Telangana Jagruti) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) అన్నారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా శనివారం ఆమె కరీంనగర్ (Karimnagar) జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ పార్టీలో చాలామంది నేతలు, ఉద్యమకారులు అసంతృప్తితో ఉన్నారని కవిత అన్నారు. జనంబాట పట్టాక బీఆర్ఎస్ నేతలు తనతో టచ్లోకి వచ్చారని చెప్పారు. తనకు అన్యాయం జరగడంతో పార్టీ నుంచి బయటికి రాలేదన్నారు. అవమానం జరిగింది కాబట్టే ఆత్మగౌరవం కోసం బయటికి వచ్చానని వెల్లడించారు. ఎవరైనా మొదటిసారి అన్యాయం చేసినప్పుడు మౌనంగా ఉంటే, మళ్లీ అన్యాయం జరిగినప్పుడు మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారన్నారు.
Kavitha Janam Bata | నా భర్త ఫోన్ ట్యాప్ చేశారు
ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వార్త వినగానే కడుపులో దేవినట్లయ్యిందని కవిత అన్నారు. సొంత బావ ఫోన్ ఎవరైనా ట్యాప్ చేస్తారా అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాగా బీఆర్ఎస్ హయాంలో విపక్ష నేతలు, జడ్జీలు, సినీ ప్రముఖుల ఫోన్లు ట్యాప్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన భర్త ఫోన్ కూడా ట్యాప్ చేశారని కవిత ఆరోపించారు.
Kavitha Janam Bata | రైతులను ఆదుకోవాలి
మొంథా తుపాన్ (Cyclone Montha)తో వర్షాలకు పంట నష్టపోయిన రైతులను కవిత పరామర్శించారు. ఈ ఏడాది వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో నెలల తరబడి కొనుగోళ్లు జరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వర్షాలకు వడ్లు తడిసి మొలకలు వస్తున్నాయని చెప్పారు. మెులకలు వచ్చి, బూజు పట్టి, తేమ శాతం ఎక్కువగా ఉన్న ధాన్యం కూడా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేల పరిహారం ఇవ్వాలన్నారు.
