అక్షరటుడే, వెబ్డెస్క్: BC Reservations | బీసీలకు బీఆర్ఎస్ వెన్నుపోటు పొడిచిందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ అన్నారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ పెద్దలతో చర్చించడానికి సీఎం రేవంత్రెడ్డి(CM Revanth Reddy), పీసీసీ అధ్యక్షుడు(PCC President), పలువురు నేతలు ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మహేశ్గౌడ్ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన హామీలు, కుల గణన, బీసీ రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge), లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ(Rahul Gandhi)కి వివరించామన్నారు.
బీసీ రిజర్వేషన్లను బీజేపీ, బీఆర్ఎస్ వ్యతిరేకిస్తున్నాయని మహేశ్గౌడ్ విమర్శించారు. బీఆర్ఎస్(BRS) హయాంలో స్థానిక సంస్థల్లో బీసీలకు 33 శాతం ఉన్న రిజర్వేషన్లను 22శాతానికి తగ్గించి వెన్నుపోటు పొడిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అసెంబ్లీలో బీసీ బిల్లులకు ఆమోదం తెలిపి తాజాగా యూటర్న్ తీసుకుందని విమర్శించారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు(Ramachandra Rao) వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు.
BC Reservations | తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలి
బీసీ రిజర్వేషన్ల(BC Reservations) అంశాన్ని కేంద్ర ప్రభుత్వం తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని మహేశ్గౌడ్ డిమాండ్ చేశారు. ఇదే అంశంపై ఖర్గే, రాహుల్ గాంధీ రెండు గంటల పాటు చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై పోరాడతామని రాహుల్, ఖర్గే హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. బీసీ రిజర్వేషన్లను కేంద్రం ఆమోదించకపోతే దేశవ్యాప్త ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
BC Reservations | బీసీలకు న్యాయం చేస్తాం
బీసీలకు న్యాయం చేయడమే కాంగ్రెస్ లక్ష్యమని మహేశ్గౌడ్ అన్నారు. తెలంగాణ కుల గణన చేపట్టిన తీరు, బీసీ రిజర్వేషన్ల అంశంపై గురువారం సాయంత్రం ఇండియా కూటమి నేతలకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తామన్నారు. రాహుల్ గాంధీ స్ఫూర్తితోనే తెలంగాణలో కులగణన చేపట్టామని వివరించారు.