అక్షరటుడే, వెబ్డెస్క్ : CBI Case | దేశంలో అవినీతి అధికారులకు కొదువలేకుండా పోయింది. గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శి (GP Secretery ) నుంచి మొదలు పెడితే సివిల్ సర్వీసెస్ (Civil Services) అధికారుల వరకు లంచాల పేరిట ప్రజలను వేధిస్తున్నారు. తమ పనులను సక్రమంగా చేయాల్సిన అధికారులు లంచాలకు మరిగి ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. బీమా డబ్బులు చెల్లించడానికి కూడా ఓ వ్యక్తి లంచం డిమాండ్ చేశాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
ఉత్తర ప్రదేశ్లోని ప్రథమ యూపీ గ్రామీణ బ్యాంక్ (Pratham UP Gramin Bank) రాంపూర్ బ్రాంచ్లో పని చేసే రికవరి ఏజెంట్ రూ.4 లక్షల బీమా డబ్బులు చెల్లించడానికి లంచం అడిగాడు. రూ.20 వేలు ఇస్తే బ్రాంచ్ మేనేజర్ను ఒప్పించి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయిస్తానని చెప్పాడు. దీంతో బాధితులు బుధవారం సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గురువారం బాధితుల నుంచి రూ.20 వేల లంచం తీసుకుంటుండగా.. రికవరీ ఏజెంట్ను సీబీఐ అధికారులు (CBI Officers) రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం రాంపూర్లోని నిందితుడి ఇళ్లలో సోదాలు నిర్వహించింది. కేసు దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.