అక్షరటుడే, వెబ్డెస్క్ : Bomb Threats | తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో ఈ ఉదయం వరుసగా వచ్చిన బాంబు బెదిరింపు కాల్స్ తీవ్ర ఉత్కంఠ కలిగించాయి. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(CM MK Stalin), స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్, బీజేపీ రాష్ట్ర కార్యాలయం, రాజ్భవన్, నటుడు-రాజకీయ నాయకుడు ఎస్వీ శేఖర్ నివాసాలకి బాంబ్ బెదిరింపు కాల్స్ వచ్చినట్టు తెలుస్తుంది.
గుర్తుతెలియని వ్యక్తులు పలు ఈ-మెయిల్ ఐడీల నుంచి బాంబు పెట్టామని హెచ్చరిస్తూ మెయిల్స్ పంపారు. ఈ మెయిల్స్ కారణంగా చెన్నైలోని కీలక ప్రాంతాల్లో ఒక్కసారిగా భద్రతా హెచ్చరికలు అమలులోకి వచ్చాయి. ఆళ్వార్పేటలోని సీఎం స్టాలిన్ నివాసం, తెనాంపేటలో త్రిష నివాసం, టీ.నగర్లోని బీజేపీ కార్యాలయం, రాజ్భవన్(Raj Bhavan), ఎస్వీ శేఖర్ ఇంటి పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు.
Bomb Threats | బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ రంగంలోకి
బాంబు బెదిరింపుల(Bomb Threats) నేపథ్యంలో బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ (BDDS), డాగ్ స్క్వాడ్ సహా ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి విస్తృత తనిఖీలు చేపట్టాయి. ప్రతి ఇంటి చుట్టూ ప్రహరీలు, పార్కింగ్ ప్రదేశాలు, ఇంటీరియర్ భాగాలను త్రవ్వి పరిశీలించారు. అయితే చివరికి ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో ఇవన్నీ బూటకపు బెదిరింపులే అని పోలీసులు ధృవీకరించారు.తమిళనాడులో గత కొన్ని నెలలుగా సెలబ్రిటీలు, రాజకీయ నేతలకు వరుస బెదిరింపులు వస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవలే టీవీకే అధినేత, నటుడు విజయ్(Actor Vijay) నివాసానికి, అలాగే గత వారం ఎస్వీ శేఖర్కు కూడా బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఇప్పుడు మళ్లీ అతనికి మరోసారి బెదిరింపు మెయిల్ రావడం గమనార్హం.
ఈ ఘటనలపై చెన్నై సైబర్ క్రైమ్ పోలీసు(Chennai Cyber Crime Police) విభాగం ఇప్పటికే విచారణ ప్రారంభించింది. ఈ బెదిరింపులు వేర్వేరు ఈ-మెయిల్ ఐడీల నుంచి, వీప్టీఎన్, ఫేక్ ఐపీల ద్వారా పంపించబడినట్లు అనుమానిస్తున్నారు. నిందితుల్ని గుర్తించడం సాంకేతికంగా సవాలుగా మారినప్పటికీ, ప్రత్యేక బృందాలు వారిని పట్టుకునేందుకు డిజిటల్ ట్రేసింగ్ ప్రారంభించాయి. పోలీసులు ఈ తరహా ఫేక్ బెదిరింపులు ప్రజల్లో భయాందోళనలు పెంచుతున్నాయని అంటున్నారు. నిందితుల్ని త్వరగా గుర్తించి కఠిన చట్ట చర్యలు తీసుకుంటామని వారు వెల్లడించారు.