అక్షరటుడే, వెబ్డెస్క్ : Bomb Threat | దేశంలో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్న నేపథ్యంలో, తాజాగా ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan) నివాసానికి కూడా బెదిరింపు మెయిల్ వచ్చింది. ఈమెయిల్ తమిళనాడు డీజీపీ కార్యాలయానికి రాగా, ఇందులో ఉపరాష్ట్రపతి నివాసంలో బాంబు ఉన్నట్లు పేర్కొన్నారు.
దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై చర్యలు తీసుకున్నారు. బాంబ్ స్క్వాడ్ (Bomb Squad) మరియు డాగ్ స్క్వాడ్తో కలిసి ఉప రాష్ట్రపతి నివాసానికి చేరిన పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అయితే, తనిఖీలలో ఎలాంటి పేలుడు పదార్థాలు లేదా అనుమానాస్పద వస్తువులు కనబడలేదు. దీంతో ఈ బెదిరింపును నకిలీగా తేల్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Bomb Threat | మరో బెదిరింపు కాల్..
తమిళనాడులో (Tamilnadu) ఇటీవలి కాలంలో పలువురు రాజకీయ, సినీ ప్రముఖుల నివాసాలు, ప్రభుత్వ, విదేశీ కార్యాలయాలకు వరుసగా బాంబ్ బెదిరింపులు (Bomb Threat) వచ్చాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, టీవీకే చీఫ్, ప్రముఖ నటుడు విజయ్, నటులు త్రిష, నయనతార నివాసాలు, BJP ప్రధాన కార్యాలయం, డీజీపీ కార్యాలయం, రాజ్భవన్కి కూడా ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. ఇటీవలే ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా స్టూడియోకూ ఇదే విధమైన బెదిరింపు మెయిల్ రాగా, పోలీసులు నకిలీగా నిర్ధారించారు. అంతేకాక, చెన్నైలో అమెరికా, రష్యా, ఇంగ్లాండ్, థాయిలాండ్, శ్రీలంక, సింగపూర్ కార్యాలయాలకు కూడా గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఇలాంటి బెదిరింపులు అందుతున్నాయి.
పోలీసులు ప్రజలందరి సహకారం కోరుతూ, అనుమానాస్పద వ్యక్తులు లేదా మెయిల్స్ ను వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. అయితే ఈ మధ్య కాలంలో ఇలాంటి బెదిరింపు కాల్స్ ఎక్కువ అవుతున్న నేపథ్యంలో పోలీసులు కూడా వీటిపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ముఖ్యంగా చెన్నైలోనే ఇటీవల ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తుండడం చర్చనీయాంశంగా మారింది.