అక్షరటుడే, వెబ్డెస్క్: Vote Chori | బీజేపీతో పాటు కేంద్ర ఎన్నికల సంఘంపై (Central Election Commission) కాంగ్రెస్ చేస్తున్న ఓట్ల చోరీ ఆరోపణలను కాషాయ పార్టీ బలంగా తిప్పి కొట్టింది. ఎన్నికల్లో అవకతవకలు, మోసాల గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ గతంలో అనేక ఉల్లంఘనలకు పాల్పడిందని విమర్శించింది. 2024 లోక్ సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు బీజేపీ బుధవారం దీటుగా స్పందించింది. కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ (Sonia Gandhi) భారత పౌరసత్వం పొందటానికి మూడేళ్ల ముందే భారత ఓటర్ల జాబితాలో ఉన్నారని సంచలన ఆరోపణలు చేసింది.
Vote Chori | పౌరసత్వం పొందకుండా ఓటుహక్కు..
ఇటలీలో జన్మించిన సోనియాగాంధీ 1983లో భారత పౌరసత్వం పొందారని కానీ అంతకు ముందే 1980లో ఓటర్ గా నమోదయ్యారని బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ (Anurag Thakur) వెల్లడించారు. బుధవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ పౌరురాలిగా గుర్తింపు పొందకుండానే.. దేశంలోని ఓటర్ల జాబితాలో చోటు సంపాదించారని ఆరోపించారు. ఇటలీకి చెందిన ఆమె.. భారతీయ పౌరసత్వం (Indian citizenship) లేకుండానే ఓటర్ల జాబితాలో పేరు చేర్చారని విమర్శించారు.
Vote Chori | ఇటలీ వ్యక్తికి ఇండియాలో ఓటు
ఠాకూర్ వ్యాఖ్యలను సమర్థిస్తూ బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా (BJP IT cell chief Amit Malviya) మరో విషయాన్ని వెల్లడించారు. ఇటలీ పౌరురాలు అయిన సోనియాగాంధీ ఇండియాలో ఓటర్ గా నమోదయ్యారని తెలిపారు. ఈ మేరకు న్యూఢిల్లీలోని (New Delhi) సఫ్దర్ జంగ్ రోడ్ లోని పోలింగ్ స్టేషన్ 145కి చెందిన 1980 నాటి ఓటర్ల జాబితా ఫొటోను ‘X’లో పోస్ట్ చేశారు. ఆ జాబితాలో ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ, సోనియా గాంధీ, మేనకా గాంధీ పేర్లు ఉన్నాయి. ఆ సమయంలో సోనియాగాంధీ ఇంకా ఇటలీ పౌరురాలేనని, భారత పౌరసత్వం తీసుకోలేదని మాల్వియా ఆరోపించారు. “భారత ఓటర్ల జాబితాతో సోనియా గాంధీకి ఉన్న సంబంధం ఎన్నికల చట్టాల ఉల్లంఘనలతో నిండి ఉంది. అనర్హులు, అక్రమ ఓటర్లను క్రమబద్ధీకరించడం పట్ల రాహుల్ గాంధీకి ఉన్న అభిమానాన్ని, SIR పట్ల ఆయనకున్న వ్యతిరేకతను ఇది వివరిస్తుంది” అని విమర్శించారు.
Vote Chori | సోనియాను తెరపైకి తెచ్చి..
కాంగ్రెస్ (Congress) చేస్తున్న ఓట్ల చోరీని బీజేపీ సోనియా అంశంతో తిప్పికొట్టింది. 1946లో ఇటలీలో జన్మించిన సోనియాగాంధీ అసలు పేరు ఎడ్విజ్ ఆంటోనియా అల్బినా మైనో. 1968లో ఆమె రాజీవ్ గాంధీని వివాహం చేసుకున్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1950 ప్రకారం, భారత పౌరుడు కాని వ్యక్తి ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవడానికి అనర్హులు. సోనియా 1983లో భారత పౌరసత్వం (Indian citizenship) పొందగా, అంతకు ముందే అంటే 1980లోనే ఆమె పేరు ఓటరు జాబితాలో చేరింది. “ఆమె (సోనియా) భారతీయ పౌరురాలు కావడానికి మూడు సంవత్సరాల ముందే 1980లో జాబితాలో ఆమె పేరు కనిపించింది. ఆమె ఇటాలియన్ పౌరసత్వాన్ని కలిగి ఉన్నప్పటికీ ఓటు పొందడం గమనార్హం” అని మాల్వియా అన్నారు. 1980లో న్యూఢిల్లీ పార్లమెంటరీ నియోజకవర్గ ఓటర్ల జాబితాను జనవరి 1, 1980 అర్హత తేదీగా సవరించారని, ఈ సమయంలోనే సోనియా గాంధీ పేరును పోలింగ్ స్టేషన్ 145లోని సీరియల్ నంబర్ 388లో చేర్చారని చెప్పారు.
అంతేకాకుండా, ఈసారి కూడా రిజిస్ట్రేషన్ తప్పుగా ఉందని, ఏప్రిల్ 1983లో తనకు అధికారికంగా పౌరసత్వం మంజూరు కావడానికి నెలల ముందు జరిగిందని మాల్వియా పేర్కొన్నారు.. సోనియా గాంధీ పేరు అక్రమంగా ఓటరు జాబితాలో (voter list) చేర్చిన వ్వవహారం బహిర్గతం కావడంతో.. ప్రజా నిరసన వెల్లువెత్తిందన్నారు. దీంతో ఈ జాబితా నుంచి సోనియా గాంధీ పేరును తొలగించారని చెప్పారు. అంతేకాదు.. రాజీవ్ గాంధీని వివాహం చేసుకున్న తర్వాత భారత పౌరసత్వాన్ని అంగీకరించడానికి ఆమెకు 15 ఏళ్లు ఎందుకు పట్టిందని తాము ప్రశ్నించడం లేదన్నారు. కానీ భారతీయ పౌరసత్వం పొందకుండానే.. ఆమె పేరు ఓటర్ల జాబితాలో చేర్చడం ఎన్నికల దుర్వినియోగం కాకుంటే మరేమిటని ప్రశ్నించారు.