అక్షరటుడే, వెబ్డెస్క్ : BJP | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు (Ramchandar Rao) నేతలు, కార్యకర్తలకు వార్నింగ్ ఇచ్చారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎంతటివారైనా కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన సోమవారం లేఖ విడుదల చేశారు.
బీజేపీలో కొంతకాలంగా పలువురు నాయకులకు పొసగడం లేదు. ముఖ్యంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay), ఎంపీ ఈటల రాజేందర్ (Etala Rajendhar) మధ్య విభేదాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఇటీవల ఎంపీ ఈటల మాట్లాడుతూ.. హుజురాబాద్ నియోజకవర్గంలో స్థానిక ఎన్నికల సీట్లు తానే ఇస్తానని ప్రకటించారు. ఈ క్రమంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లేఖ విడుదల చేసినట్లు తెలుస్తోంది. పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా ప్రకటనలు చేస్తే ఊరుకోమని రాష్ట్ర అధ్యక్షుడు హెచ్చరించారు. పార్టీకి వ్యతిరేకంగా ప్రకటనలు కార్యకర్తలలో గందరగోళం సృష్టిస్తాయన్నారు. పార్టీ ప్రతిష్టకు ఎవరు భంగం కలిగించినా సహించేది లేదని స్పష్టం చేశారు.
BJP | జూబ్లీహిల్స్లో బీజేపీదే గెలుపు
జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని రామచందర్రావు అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. అభ్యర్థిని మంగళవారం లోపు ప్రకటిస్తామన్నారు. ఉప ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి కాంగ్రెస్ గుర్తుపై పోటీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. హస్తంతోనే పతంగి ఎగిరేయాలని చూస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న నవీన్ యాదవ్ గతంలో ఎంఐఎం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ క్రమంలో తాజాగా రామచందర్రావు వ్యాఖ్యలు చేశారు. నవీన్యాదవ్కు కాంగ్రెస్ టికెట్ కేటాయించిన తర్వాత ఎంఐఎం నాయకులను కలిశారని ఆయన ఆరోపించారు.
BJP | వారికి ఓటు వేసినా వేస్టే..
జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ (BRS)కు ఓటు వేసిన ప్రయోజనం లేదని బీజేపీ చీఫ్ అన్నారు. ఒకవేళ బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచినా మళ్లీ కాంగ్రెస్లోకి వెళ్తారన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయలేదన్నారు. ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించి మోదీకి గిఫ్ట్ ఇస్తామన్నారు.