Homeతాజావార్తలుAnde Sri | అనాథ నుంచి డాక్ట‌రేట్‌గా.. అందెశ్రీకి అధికారిక లాంఛ‌నాల‌తో అంత్య‌క్రియ‌లు

Ande Sri | అనాథ నుంచి డాక్ట‌రేట్‌గా.. అందెశ్రీకి అధికారిక లాంఛ‌నాల‌తో అంత్య‌క్రియ‌లు

అందెశ్రీ మరణం తెలుగు సాహిత్యానికి, తెలంగాణ ఆత్మకు నష్టమని సాహితీవేత్తలు, అభిమానులు బాధ వ్యక్తం చేస్తున్నారు. ఆయ‌న అంత్య‌క్రియ‌ల‌ని అధికారిక లాంఛ‌నాల‌తో జ‌ర‌పాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ande Sri | ప్రముఖ ప్రజాకవి, గేయరచయిత అందెశ్రీ (64) కన్నుమూశారు. ఆదివారం ఉదయం ఆయన అకస్మాత్తుగా ఇంట్లో కుప్పకూలగా, కుటుంబ సభ్యులు వెంటనే గాంధీ ఆసుపత్రి (Gandhi Hospital)కి తరలించారు. అయితే చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

అందెశ్రీ మరణవార్తతో తెలుగు సాహిత్య వర్గాలు, కళారంగం, తెలంగాణ (Telangana) ప్రజల్లో తీవ్ర విషాదం నెలకొంది. 1961 జూలై 18న సిద్దిపేట జిల్లా రేబర్తిలో జన్మించిన అందెశ్రీ అసలు పేరు అందె ఎల్లయ్య. చిన్న వయసులోనే అనాథగా పెరిగిన ఆయన తల్లిదండ్రులు ఎవరో కూడా తెలియదు. జీవనం కోసం కొన్నాళ్లు గొర్రెల కాపరిగా పనిచేశారు. అదే సమయంలో కవిత్వం, గీతరచన వైపు ఆకర్షితమయ్యారు. చదువు లేకపోయినా తన ప్రతిభతో తెలుగు సాహిత్యంపై అద్భుతమైన పట్టు సాధించారు. అనంతరం కాకతీయ విశ్వవిద్యాలయం (Kakatiya University) ఆయనకు గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసింది.

Ande Sri | ప్రజా కవిత్వానికి ప్రతీక

అందెశ్రీ రాసిన “మాయమైపోతున్నడమ్మ మనిషన్నవాడు” పాట ఆయనకు మొదటి గుర్తింపును తెచ్చింది. ఆయన స్టేజీపై పాడే తీరు, కళ్లుమూసుకుని, గంభీర స్వరంతో ఆలపించే శైలి ప్రజల్లో ఆయనకు ప్రత్యేక అభిమాన వర్గాన్ని ఏర్పరచింది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అందెశ్రీ (Ande Sri)పాటలు ఉద్యమకారుల్లో ఉత్సాహం నింపాయి. ముఖ్యంగా ఆయన రాసిన “జయ జయహే తెలంగాణ జననీ జయ కేతనం” గీతం ఉద్యమానికి ప్రతీకగా నిలిచింది. ఆ గీతమే తరువాత తెలంగాణ అధికారిక రాష్ట్ర గీతంగా ఎంపిక కావడం ఆయనకు చిరస్మరణీయ గౌరవాన్ని తెచ్చింది. 2007లో వచ్చిన ‘గంగ’ చిత్రంలోని పాటలకు అందెశ్రీ ఉత్తమ గీత రచయితగా నంది అవార్డు అందుకున్నారు. అలాగే ‘ముత్యాల ముగ్గు’, ‘విచిత్రం’ వంటి చిత్రాల్లో ఆయన రాసిన పాటలు తెలుగు సినీ సంగీత చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించాయి.

జీవితాంతం సాదాసీదాగా జీవించిన అందెశ్రీకి తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ఆయన సేవలకుగాను రూ. కోటి నగదు పురస్కారం అందించింది. గొర్రెల కాపరి నుంచి ప్రజాకవిగా ఎదిగిన ఆయన జీవితం పట్టుదల, ప్రతిభ, ప్రజాభిమానానికి నిలువెత్తు ఉదాహరణగా నిలిచింది. అందెశ్రీ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావును సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశించారు.

Must Read
Related News