అక్షరటుడే, వెబ్డెస్క్ : KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్కు షాక్ తగిలింది. ఫార్ములా ఈ–కారు రేసు కేసులో ఆయన విచారణకు గవర్నర్ అనుమతించారు. దీంతో ఏసీబీ అధికారులు (ACB Officers) ఆయనపై అభియోగాలు నమోదు చేసే అవకాశం ఉంది.
బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ నగరంలో ఫార్ములా ఈ–కారు రేసు (Formula E Car Race) నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ మేరకు అధికారంలోకి వచ్చాక ఆ కేసు విచారణను ఏసీబీకి అప్పగించింది. ఈ కేసులో ఏ–1 కేటీఆర్, ఏ–2గా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ (IAS Officer Arvind Kumar) పేర్లను ఏసీబీ చేర్చింది. మాజీ మంత్రి కేటీఆర్ను ఇప్పటికే నాలుగు సార్లు విచారించింది. అరవింద్ కుమార్ను సైతం పలుమార్లు విచారించి కీలక విషయాలు రాబట్టింది. అనంతరం కేటీఆర్ ప్రాసిక్యూషన్కు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం గవర్నర్కు గతంలో లేఖ రాసింది. దీంతో ఆయన విచారణకు అనుమతి ఇచ్చారు.
KTR | అరెస్ట్ తప్పదా..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ (BRS) హయాంలో జరిగిన పలు అక్రమాలు, అవినీతిపై విచారణ చేపడుతోంది. కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission) విచారణ పూర్తయింది. ఫోన్ ట్యాపింగ్ విచారణ కొనసాగుతోంది. మరోవైపు ఫార్ములా ఈ రేసు కేసు విచారణ సైతం అధికారులు చేపడుతున్నారు. కేటీఆర్ను అరెస్ట్ చేస్తారని గతంలో ప్రచారం జరిగింది. కేటీఆర్ (KTR) సైతం అరెస్ట్ చేస్తే కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటానని గతంలో వ్యాఖ్యానించారు. అయితే ప్రభుత్వం మాత్రం ఆయనను అరెస్ట్ చేయలేదు. తాజాగా ఫార్ములా ఈ–రేసు కేసులో విచారణకు గవర్నర్ అనుమతి రావడంతో ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. త్వరలోనే కేటీఆర్పై అధికారులు అభియోగాలు నమోదు చేయనున్నారు. విచారణ తర్వాత ఛార్జిషీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఛార్జీషీట్ దాఖలు అనంతరం అరెస్ట్ చేస్తారా.. లేదా అనే విషయాలు తెలియనున్నాయి.
