అక్షరటుడే, ఇందూరు: Collector Nizamabad | జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. రానున్న రెండు రోజుల పాటు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందన్నారు. ఈ నేపథ్యంలో పట్టణాలు, గ్రామాలు, తండాలలో ప్రజలను కూడా అప్రమత్తం చేయాలని సూచించారు. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలన్నారు.
జిల్లా కలెక్టరేట్లో పోలీస్ కమిషనర్ సాయి చైతన్యతో కలిసి గురువార పరిస్థితులను సమీక్షించారు. ఏకధాటిగా కురుస్తున్న వర్షాల వల్ల ఎక్కడెక్కడ చెరువులు, కుంటలు, వాగులు తెగిపోయాయి, ముంపునకు గురైన నివాస ప్రాంతాలు, దెబ్బతిన్న రోడ్లు, పడిపోయిన విద్యుత్ స్తంభాలు, కొట్టుకుపోయిన ట్రాన్ఫార్మర్లు తదితర వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
ప్రమాదం పొంచి ఉన్న గ్రామాలు, తండాల ప్రజలను పునరావాస కేంద్రాలకు, సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. వరద ఉధృతి పెరిగే అవకాశాలు ఉన్నందున ప్రజలకు మైకుల ద్వారా అప్రమత్తం చేయాలని కలెక్టర్ సూచించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిన గ్రామాల్లో తక్షణమే విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయా శాఖల అధికారులు, సిబ్బంది కార్యస్థానాల్లో అందుబాటులో ఉంటూ, క్షేత్రస్థాయి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలన్నారు. రానున్న 48 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, అత్యవసరమైతేనే తప్ప ప్రజలకు ఇళ్ల నుంచి రావొద్దని కలెక్టర్ సూచించారు.
లోతట్టు ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాల వద్దకు ప్రజలు ఎవరూ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. చేపల వేట, ఈత కోసం చెరువులు, కాల్వలు, రిజర్వాయర్లలోకి దిగకుండా కట్టడి చేయాలన్నారు. అవసరమైన చోట పోలీసు బందోబస్తు, పికెట్లను ఏర్పాటు చేయించాలని ఆదేశించారు.
అవసరమైన వెంటనే సహాయక చర్యలు చేపట్టేలా జేసీబీలు, ఇసుక బస్తాలను సిద్ధంగా ఉంచుకోవాలని మున్సిపల్ కమిషనర్లను, ఎంపీడీవోలు, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, ఇరిగేషన్ తదితర శాఖల అధికారులను ఆదేశించారు. కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసి, ప్రజలకు వరద పరిస్థితిపై సమాచారం తెలియజేస్తూ అప్రమత్తం చేయాలన్నారు.
శిథిలావస్థకు చేరిన ఇళ్లలో ఉంటున్న వారిని తక్షణమే ఖాళీ చేయించాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందస్తుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. అన్ని శాఖల అధికారులు పరస్పరం సమన్వయంతో పనిచేస్తూ, భారీ వర్షాల వల్ల జిల్లాలో ఎలాంటి ఘటనలు జరుగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. సమీక్షలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్ వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.