Homeజిల్లాలుకామారెడ్డిBC Declaration | బీసీ డిక్లరేషన్ అమలు చేయాల్సిందే.. బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఛైర్మన్...

BC Declaration | బీసీ డిక్లరేషన్ అమలు చేయాల్సిందే.. బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఛైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాల్సిందేనని బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఛైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య అన్నారు. కామారెడ్డిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి : BC Declaration | ఎన్నికల సమయంలో కామారెడ్డి కేంద్రంగా కర్ణాటక సీఎంతో ప్రకటన చేయించిన విధంగా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ (BC Declaration) అమలు చేయాల్సిందేనని 42శాతం బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఛైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య అన్నారు. 42శాతం రిజర్వేషన్ సాధనలో భాగంగా కామారెడ్డి (Kamareddy) పట్టణంలో ఈనెల 15న నిర్వహించనున్న బీసీ ఆక్రోశ సభ సన్నాహక సమావేశాన్ని పట్టణంలోని ఆర్​అండ్​బీ గెస్ట్ హౌస్​లో ఆదివారం నిర్వహించారు.

అనంతరం మీడియా మాట్లాడుతూ.. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local Body Elections) రిజర్వేషన్ 23 శాతం నుంచి 42 శాతానికి పెంచుతామని, విద్య, ఉద్యోగాలలో 42 శాతం ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అలాగే బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి బీసీల అభివృద్ధి కోసం ఏడాదికి 20వేల కోట్లు ఖర్చు చేస్తామని.. ఒక్కో మండలంలో గురుకుల పాఠశాల ఏర్పాటు చేసి నవోదయ స్టాండెడ్​లో విద్య అందిస్తామని చెప్పారన్నారు. జిల్లాకు ఒక బీసీ కళాశాల ఏర్పాటు చేస్తామని, కులవృత్తులు, కుల సంఘాలకు చేయూతనిస్తామని హామీ ఇచ్చి మరిచారన్నారు.

2023లో కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పాటయితే కులగణన కోసమే ఏడాది సమయం తీసుకున్నారని.. నాడు ఆర్టికల్ 342(ఏ)3 కింద కులగణన (Caste census) చట్టం చేయవచ్చని ఓ చట్టాన్ని తాను రాసిచ్చానని తెలిపారు. దాని ప్రకారం కాకుండా వేరే విధంగా ఇచ్చారన్నారు. రిజర్వేషన్ రాద్ధాంతం జరుగుతుంటే ముసాయిదా డ్రాఫ్ట్ ఇచ్చానని తెలిపారు. తమిళనాడు తరహాలో తెలంగాణలో (Telangana) కూడా రిజర్వేషన్ పెంచుకోవడానికి చట్టాన్ని రాసి ఇస్తే దానిని చూడలేదన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇదొక్కటే మార్గమని సీఎంను పిలుచుకుని ముసాయిదా తయారు చేసుకుని రెండు బిల్లులు తయారు చేసినట్లు పేర్కొన్నారు.

ఈ రెండు బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించి గవర్నర్​కు పంపిస్తే ఆయన కేంద్రానికి పంపారని తెలిపారు. ఆ తర్వాత పంచాయతీరాజ్ చట్టం సవరణ చేస్తూ ఇచ్చిన జీవోలను సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పుకు విరుద్ధంగా ఉన్నాయని స్టే ఇస్తే సుప్రీంకు వెళ్లారని తెలిపారు. దీనికి 9వ షెడ్యూల్ చేర్చడమే పరిష్కార మార్గమని బీసీలను చైతన్యం చేయడం కోసం సభలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

తాము ఏ పార్టీ సంఘానికి అనుబంధం కాదని జస్టిస్​ ఈశ్వరయ్య స్పష్టం చేశారు. రిజర్వేషన్ కోసం సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)  సిన్సియర్​గా ప్రయత్నం చేయలేదని, ప్రధానిని కలవలేదని తెలిపారు. బీసీ రిజర్వేషన్ పట్ల బీజేపీకి చిత్తశుద్ధి లేదని, బీజేపీ బీసీల పార్టీ కాదన్నారు. రిజర్వేషన్ అమలు చేస్తే కాంగ్రెస్​కు పేరొస్తుందని, తద్వారా అన్ని రాష్ట్రాల నుంచి ఈ డిమాండ్ పెరుగుతుందని రిజర్వేషన్ అమలు చేయడం లేదన్నారు. బీఆర్ఎస్​కు కూడా చిత్తశుద్ధి లేదన్నారు. 2017లోనే బీఆర్ఎస్ కులగణన ఎందుకు చేయలేదని, బీసీ రిజర్వేషన్ కోసం ఎందుకు ఆలోచించలేదని ప్రశ్నించారు.

బీఆర్ఎస్ కూడా చారిత్రాత్మక తప్పిదం చేసిందన్నారు. బీజేపీ (BJP)తో కాంప్రమైజ్ అయి 33 శాతం నుంచి 23 శాతానికి తగ్గించుకుందన్నారు. ప్రస్తుతం పాత పద్దతిలో ఎన్నికలకు వెళ్లాల్సి వస్తే 23శాతంతోనే వెళ్లాల్సి ఉంటుందన్నారు. ఈనెల 15 తర్వాత అన్ని జిల్లాలలో సభలు నిర్వహిస్తామని, అన్ని జిల్లాల్లో కమిటీలు వేస్తామని పేర్కొన్నారు. ఆ తర్వాత జాతీయ స్థాయిలో ఉద్యమిస్తామని చెప్పారు. అనంతరం ఈ నెల 15న నిర్వహించే సభ కరపత్రాలను ఆవిష్కరించారు.

సమావేశంలో ఆల్ ఇండియా బీసీ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు విజయ భాస్కర్, వర్కింగ్ ప్రెసిడెంట్ గంగాధర్ యాదవ్, జిల్లా సీనియర్ న్యాయవాది సిద్దిరాములు, కురుమ సంఘం జిల్లా అధ్యక్షుడు భూమన్న, ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు విఠల్, గౌడ సంఘం జిల్లా కార్యదర్శి బాలార్జున్ గౌడ్, బార్ కౌన్సిల్ వైస్ ఛైర్మన్ సునీల్ గౌడ్, బీసీ న్యాయవాదుల జనరల్ సెక్రెటరీ దేవరాజు గౌడ్, చేతి వృత్తుల సంఘం జిల్లా కన్వీనర్ వెంకట్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Must Read
Related News