అక్షరటుడే, వెబ్డెస్క్ : Temba Bavuma | భారత పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న కొన్ని వివాదాస్పద సంఘటనలపై దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు కెప్టెన్ టెంబా బవుమా తాజాగా స్పందించాడు. తన ఎత్తును ఉద్దేశించి భారత ఆటగాళ్లు చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన బవుమా, ఆ తర్వాత భారత సీనియర్ ఆటగాళ్లు జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah), రిషభ్ పంత్ (Rishabh Pant) తన వద్దకు వచ్చి క్షమాపణ చెప్పారని వెల్లడించాడు.
ఇటీవల ముగిసిన భారత పర్యటనపై ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోకు రాసిన వ్యాసంలో బవుమా ఈ అంశాలను ప్రస్తావించాడు.కోల్కతా టెస్టు సందర్భంగా మైదానంలో తన గురించి భారత ఆటగాళ్లు వారి భాషలో ఏదో వ్యాఖ్యలు చేశారని బవుమా పేర్కొన్నాడు. “ఆ తర్వాత సీనియర్ ఆటగాళ్లయిన రిషభ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా నా దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పారు. వారు సారీ చెప్పే సమయంలో అసలు విషయం ఏంటో నాకు తెలియదు. తర్వాత మీడియా మేనేజర్ను అడిగి విషయం తెలుసుకున్నాను” అని బవుమా వివరించాడు.
Temba Bavuma | ఆ పదం వాడకుండా ఉండాల్సింది..
మైదానంలో జరిగే విషయాలు అక్కడికక్కడే ముగిసిపోతాయని చెప్పిన బవుమా, మాటల ప్రభావం మాత్రం మిగిలిపోతుందని వ్యాఖ్యానించాడు. “మైదానంలో జరిగినవి అక్కడే ఉండిపోతాయి. కానీ అన్న మాటలను పూర్తిగా మర్చిపోలేం. అయినా వాటిని కక్షగా కాకుండా, ప్రేరణగా, ఇంధనంగా మలుచుకుంటాం” అని ఆయన పేర్కొన్నాడు. ఇదే సమయంలో దక్షిణాఫ్రికా జట్టు కోచ్ షుక్రి కాన్రాడ్ (Coach Shukri Conrad) చేసిన ‘గ్రోవెల్’ (మోకరిల్లేలా చేయడం) వ్యాఖ్యలపై కూడా బవుమా స్పందించాడు. “ఆ పదం వాడటంపై విమర్శలు వచ్చాయి. నిజానికి ఆ మాట విన్నప్పుడు నాక్కూడా కొంత అసౌకర్యంగా అనిపించింది. బహుశా ఆయన ఇంకా మంచి పదాన్ని ఎంచుకుని ఉండాల్సింది. అయితే ఆ తర్వాత ఆయనే స్వయంగా క్షమాపణ చెప్పడంతో ఆ వివాదం అక్కడితో ముగిసింది” అని బవుమా స్పష్టం చేశాడు.
భారత పర్యటన ఎప్పుడూ సవాలుతో కూడుకున్నదేనని ముందుగానే అంచనా వేసుకున్నామని బవుమా తెలిపాడు. తాము ఊహించినట్లుగానే ఈసారి కూడా గట్టి పోటీ ఎదురైందని అన్నాడు. ఇటీవల ముగిసిన ఈ పర్యటనలో దక్షిణాఫ్రికా జట్టు (South Africa Team) భారత్లో 25 ఏళ్ల తర్వాత టెస్టు సిరీస్ను గెలుచుకోవడం విశేషంగా నిలిచింది. అయితే అదే పర్యటనలో వన్డే, టీ20 సిరీస్లను మాత్రం దక్షిణాఫ్రికా కోల్పోయిన విషయం తెలిసిందే. మొత్తానికి, మైదానంలో చోటుచేసుకున్న మాటల వివాదాలపై సమతుల్యంగా స్పందించిన బవుమా వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.