అక్షరటుడే, వెబ్డెస్క్ : Sabarimala | శబరిమల అయ్యప్ప (Ayyappa) స్వామి ఆలయం ఆదివారం సాయంత్రం తెరుచుకున్న విషయం తెలిసిందే. మకర విళక్కు సీజన్లో భాగంగా సోమవారం నుంచి స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు.
అయ్యప్ప దర్శనానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. ఆలయం తెరుచుకోవడంతో వేల సంఖ్యలో స్వామి దర్శనానికి పోటెత్తారు. ఆదివారం ప్రారంభమైన మండల పూజ సీజన్ డిసెంబర్ 26న సన్నిధానంలో జరిగే ప్రత్యేక పూజతో ముగియనుంది. ఈ క్రమంలో మంగళవారం భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో స్వామి దర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. దీంతో క్యూలైన్లలో వారు పడిగాపులు కాస్తున్నారు. సరైన ఏర్పాట్లు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Sabarimala | ప్రారంభంలోనే..
శబరిమల వద్ద రెండు నెలల పాటు జరిగే మండల-మకరవిళక్కు తీర్థయాత్ర సీజన్ అల్లకల్లోలంగా ప్రారంభమైంది. రద్దీ నిర్వహణ లోపం, ప్రాథమిక సౌకర్యాల వైఫల్యం, తగినంత పరిపాలనా సంసిద్ధత లేకపోవడం వంటి ఆందోళనలు పెరుగుతున్నాయి. భారీ సంఖ్యలో యాత్రికుల రద్దీని నిర్వహించడానికి, మధ్యాహ్నం సెషన్ను రెండు గంటలు పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం ఆలయానికి దాదాపు రెండు లక్షల మంది భక్తులు వచ్చారని అంచనా.
ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు జయకుమార్ ఏర్పాట్లు సరిపోలేదని అంగీకరించారు. తాగునీటి పాయింట్ల కొరత, సరిగా నిర్వహించబడని బయో-టాయిలెట్లు, తగినంత ఆహార సరఫరా లేదని ఆయన ఎత్తిచూపారు. రానున్న రోజుల్లో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా వారాంతాలు, పండుగ రోజుల్లు అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలి వస్తారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
