అక్షరటుడే, వెబ్డెస్క్ : Ayodhya | అయోధ్య నగరంలో ఆదివారం దీపోత్సవం (Deepotsavam) ఘనంగా నిర్వహించారు. ఈ ఏడాది 26 లక్షలకుపైగా దీపాలను వెలిగించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో అయోధ్య దీపాకాంతులతో వెలిగిపోతుంది.
రాముడి జన్మించిన ఉత్తర ప్రదేశ్ (UP)లోని అయోధ్యలో ఏటా దీపావళికి ముందు రోజు ఘనంగా దీపోత్సవం కార్యక్రమం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఆదివారం సాయంత్రం దీపోత్సవాన్ని సీఎం యోగి ఆదిత్యనాథ్ (CM Yogi Adityanath) ప్రారంభించారు. ముందుగా ఆయన రామ్ కీ పైడీ ఘాట్లో హారతి నిర్వహించారు. అయోధ్య రామమందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దీపాలు వెలిగించి ఉత్సవాలను ప్రారంభించారు.
Ayodhya | ఆకట్టుకున్న లేజర్ షో
దీపాలను వెలిగించడానికి సరయూ నదీ (Sarayu River) తీరం వెంబడి లక్షలాది భక్తులు తరలి వచ్చారు. దీంతో ఆ ప్రాంతం దీపాల కాంతులు, భక్తుల రద్దీతో సందడిగా మారింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, లేజర్ షో (Laser Show) ఆకట్టుకున్నాయి. ఈ దీపోత్సవం సందర్భంగా రెండు గిన్నిస్ రికార్డులను యూపీ సీఎం అందుకున్నారు. ఎక్కువ మంది ఒకేసారి దీపాలను వెలిగించినందుకు, అతిపెద్ద నూనె దీపాల ప్రదర్శన సందర్భంగా రెండు రికార్డులు వచ్చాయి.
Ayodhya | అయోధ్యలో అభివృద్ధి
యూపీ సీఎం యోగి మాట్లాడుతూ.. ప్రపంచం నలుమూలల నుంచి సనాతన ధర్మ అనుచరులు ఇప్పుడు అయోధ్యకు వస్తున్నారని చెప్పారు. ప్రజలు రామ్ లల్లాను సందర్శించడానికి వస్తున్నారన్నారు. ప్రస్తుతం అయోధ్యలో అభివృద్ధి జరుగుతోందని పేర్కొన్నారు. కాగా ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు 23.82 కోట్ల మంది బాలరాముడిని దర్శించుకున్నారు. గతంలో పండుగల సమయంలో అల్లర్లు జరిగేవని యోగి అన్నారు. కానీ ప్రస్తుతం చట్ట ప్రకారం పాలన జరుగుతోందన్నారు. ఎనిమిది సంవత్సరాల తర్వాత ఉత్తరప్రదేశ్ మాఫియా పాలన, గూండాల నుంచి విముక్తి పొందిందని చెప్పారు. ఒకప్పుడు బుల్లెట్లు మోగిన చోట ఇప్పుడు దీపాలు వెలిగిస్తున్నారని ఆయన అన్నారు.