అక్షరటుడే, వెబ్డెస్క్ : Hyderabad | హైదరాబాద్లో దారుణం చోటు చేసుకుంది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ (Rajendranagar police station) పరిధిలోని కిస్మత్పూర్ బ్రిడ్జి కింద మహిళ మృతదేహం లభ్యమైంది. నగ్నంగా ఉన్న యువతి మృతదేహంతో కూడిన సంచి లభించడం స్థానికంగా కలకలం రేపింది. మూడు రోజుల క్రితం ఆమె హత్యకు గురైందని పోలీసులు (Police) అనుమానిస్తున్నారు.
బాధితురాలి వయస్సు 25 నుండి 30 సంవత్సరాల మధ్య ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. శరీరంపై దుస్తులు లేకపోవడంతో, మహిళను చంపడానికి ముందు లైంగిక దాడికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు (Rajendranagar police) హుటాహుటిన రంగంలోకి దిగారు. ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆధారాలను సేకరిస్తున్నారు. అలాగే, అనుమానితులను గుర్తించడానికి సమీపంలోని ప్రదేశాల నుంచి CCTV ఫుటేజ్లను ప్రత్యేక క్లూస్ బృందం విశ్లేషిస్తోంది. అన్ని కోణాల్లో క్షుణ్ణంగా దర్యాప్తు చేయడానికి ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. బాధితురాలు ఎవరనేది ఇంకా గుర్తించలేదు.
ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించిన పోలీసులు.. దర్యాప్తునకు (investigation) సహాయపడే ఏదైనా సమాచారం ఉంటే తమను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు, సీసీ టీవీ ఫుటేజీల్లో కీలక ఆధారాలు లభ్యమైనట్లు తెలిసింది. మహిళను హత్య చేసిన నిందితుడు మృతదేహాన్ని సంచిలో కుక్కి, ఆటోలో ఇక్కడకు తీసుకుచ్చినట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని బ్రిడ్జి కింద పడేసిన నిందితుడు చాలా సేపు అక్కడే ఉన్నట్లు తేలింది. ఆ తర్వాత రైలు ఎక్కి అస్సాం పారిపోయినట్లు గుర్తించారు. అతడి కోసం ప్రత్యేక బృందం గాలిస్తోంది.