అక్షరటుడే, వెబ్డెస్క్ : West Bengal | పశ్చిమ బెంగాల్లో మరో దారుణం చోటు చేసుకుంది. ఆర్జీకర్ ఆస్పత్రిలో పీజీ విద్యార్థినిపై హత్యాచార ఘటన మరువక ముందే, మరో మెడికల్ స్టూడెంట్పై తాజాగా సామూహిక అత్యాచారం జరిగింది.
దుర్గాపూర్(Durgapur)లోని ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో రెండవ సంవత్సరం వైద్య విద్యార్థిని శుక్రవారం రాత్రి తన స్నేహితురాలితో కలిసి స్నాక్స్ తినడానికి వెళ్లినప్పుడు ఈ దారుణం చోటు చేసుకుంది. ఒడిశాలోని జలేశ్వర్కు చెందిన బాధితురాలు ప్రస్తుతం స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ దిగ్భ్రాంతికరమైన సంఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
West Bengal | స్నాక్స్ కోసం వస్తే..
బాధితురాలు తన స్నేహితురాలితో కలిసి ఫుచ్కా (పానీ పూరీ) తినడానికి శుక్రవారం సాయంత్రం కళాశాల నుంచి బయటకు వచ్చింది. రాత్రి 8:30 గంటల ప్రాంతంలో పానీపూరీ తినేందుకు వెళ్తుండగా, కొందరు యువకులు ఆమెను వెంబడించి వేధించారు. కాసేపటి తర్వాత దుండగులు.. యువతి స్నేహితురాలిని అక్కడి నుంచి తరిమేసి, బాధితురాలిని కళాశాల క్యాంపస్ (College Campus) వెనుక ఉన్న సమీపంలోని అటవీ ప్రాంతానికి లాక్కెళ్లారు. అక్కడ ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
అనంతరం దుండగులు బాధితురాలి మొబైల్ ఫోన్ను కూడా లాక్కొని పారిపోయారు. బాధితురాలి స్నేహితురాలు హాస్టల్కు వెళ్లి జరిగిందంతా చెప్పింది. దీంతో సహచర విద్యార్థులంతా కలిసి గాలించగా, గాయపడి అపస్మారక స్థితిలో ఉన్న బాధితురాలిని గుర్తించి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కళాశాల అధికారులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దుర్గాపూర్ న్యూ టౌన్షిప్ పోలీసులు (Durgapur New Township Police) కేసు నమోదు చేశారు. నిందితులను గుర్తించడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.
West Bengal | ప్రశ్నార్థకంగా మహిళల భద్రత
సెకండియర్ మెడికల్ స్టూడెంట్పై (Medical Student) జరిగిన గ్యాంగ్ రేప్ ఘటన బెంగాల్లో మహిళల భద్రతపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తింది. తాజా లైంగిక దాడి మహిళల భద్రతపై విద్యార్థులలో ఆగ్రహాన్ని రేకెత్తించింది. గత సంవత్సరం ఆగస్టులో ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రెయినీపై జరిగిన హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అలాగే, జూన్లో దక్షిణ కలకత్తాలో లా విద్యార్థినిపై సామూహిక అత్యాచారం చోటు చేసుకుంది. తాజాగా మరో మెడికల్ స్టూడెంట్పై గ్యాంగ్ రేప్ జరుగడం మహిళా భద్రతపై ప్రశ్నలను లేవనెత్తుతోంది.