అక్షరటుడే, వెబ్డెస్క్ : Private School | ఓపికగా ఉండి విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పాల్సిన కొందరు టీచర్లు (Teachers) విచక్షణ కోల్పోతున్నారు. విద్యార్థులను ఇష్టం వచ్చినట్లు కొడుతున్నారు.
పాఠశాలల్లో పిల్లలు అల్లరి చేస్తుంటారు. అలాంటి వారిని టీచర్లు మందలిస్తారు. అయితే ఓ ఉపాధ్యాయుడు మాత్రం తల పగిలేలా విద్యార్థినిని కొట్టాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు (Chittoor) జిల్లా పుంగనూరులో చోటు చేసుకుంది. పుంగనూరులోని భాష్యం స్కూల్ (Bhashyam School)లో సాత్విక నాగశ్రీ (11) అనే విద్యార్థి ఆరో తరగతి చదువుతోంది. ఐదు రోజుల క్రితం పాఠశాలలో నాగశ్రీ అల్లరి చేయగా.. ఉపాధ్యాయుడు సలీం బాషా బ్యాగ్తో తలపై బలంగా కొట్టాడు. దీంతో ఆమె పుర్రె ఎముక చిట్లింది.
Private School | పట్టించుకొని ప్రిన్సిపాల్
విద్యార్థినికి తీవ్ర గాయం కావడంతో నొప్పితో విలవిలలాడింది. ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వారు ఆస్పత్రికి తరలించారు. ఎక్స్ రే తీయగా.. బాలిక పుర్రెపై చిట్లినట్లుగా వైద్యులు గుర్తించారు. ఈ ఘటనపై ఫిర్యాదు చేసినా పాఠశాల ప్రిన్సిపాల్ సుబ్రహ్మణ్యం పట్టించుకోలేదని బాలిక తల్లి విజేత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం బాలిక మదనపల్లె (Madanapalle)లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతోంది.
Private School | చర్యలు కరువు
పలు ప్రైవేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, యాజమాన్యం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. తల్లిదండ్రుల నుంచి వేల రూపాలయ ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలు సరైన ఉపాధ్యాయులు నియమించుకోవడం లేదు. దీంతో విద్యార్థులు నష్టపోతున్నారు. అంతేగాకుండా పలువురు టీచర్లు విద్యార్థులను ఇష్టం వచ్చినట్లు కొడుతున్నారు. ఇలాంటి ఉపాధ్యాయులు, పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.