అక్షరటుడే, వెబ్డెస్క్ : ACB Trap | అవినీతి అధికారులు మారడం లేదు. ప్రతి పనికి లంచం (Bribe) తీసుకుంటున్నారు. నిత్యం ఏసీబీ దాడులు (ACB Raids) చేస్తున్నా కనీసం భయం లేకుండా లంచాలు తీసుకుంటున్నారు. కార్యాలయాలకు పనుల నిమిత్తం వచ్చే వారిని డబ్బుల కోసం వేధిస్తున్నారు. కొందరు అధికారులైతే లంచం తీసుకోవడం తమ హక్కుగా భావిస్తున్నారు. తాజాగా మంచిర్యాల (Mancherial) జిల్లాలో ఓ అధికారి కార్మికుడి బీమా డబ్బులు చెల్లించడానికి డబ్బులు తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు.
మంచిర్యాల జిల్లా సహాయ లేబర్ ఆఫీసర్గా కాటం రామ్మోహన్ పని చేస్తున్నారు. ఆయన సిర్పూర్ కాగజ్ నగర్ (Sirpur Kagaz Nagar) ఇన్ఛార్జిగా కూడా పని చేస్తున్నారు. లేబర్ ఆఫీస్లో నమోదు చేసుకున్న కార్మికుడు ఇటీవల మృతి చెందాడు. దీంతో బీమా డబ్బులు, అంత్యక్రియల సాయం కోసం ఆయన సోదరుడు దరఖాస్తు చేశాడు.
ఈ అప్లికేషన్ను ప్రాసెస్ చేసి ఉన్నతాధికారులకు పంపించడానికి సహాయ లేబర్ ఆఫీసర్ కాటం రామ్మోహన్ రూ.50 వేల లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ మేరకు శుక్రవారం లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రామ్మోహన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
ACB Trap | లంచం అడిగితే ఫిర్యాదు చేయండి
ప్రజలు అధికారులకు లంచాలు ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీకి ఫోన్ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number), వాట్సాప్ నంబర్ 9440446106కు సమాచారం అందిస్తే అవినీతి అధికారుల పని పడతామని తెలుపుతున్నారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పనులు కావేమోనని పలువురు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఎలాంటి భయం వద్దని, సదరు పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.