అక్షరటుడే, వెబ్డెస్క్ : Asia Cup | ఆసియా కప్ 2025లో భాగంగా జరగనున్న భారత్ – పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ (Ind vs Pak Match) ఇప్పుడు క్రీడా ప్రాధాన్యత కంటే, సామాజిక-రాజకీయ దుమారాన్ని ఎక్కువగా రేపుతోంది.
ఈ మ్యాచ్ను చాలా మంది ప్రజలు, రాజకీయ నేతలు, ఉగ్రదాడి బాధితుల కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సోషల్ మీడియాలోనూ #BoycottINDvsPAK అనే హ్యాష్ట్యాగ్ జోరుగా ట్రెండ్ అవుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్ (Pahalgam) ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.
Asia Cup | విమర్శల మధ్య..
పహల్గామ్ దాడిలో తన కుమారుడు శుభం ద్వివేదిని కోల్పోయిన సంజయ్ ద్వివేది భారత ప్రభుత్వం పై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రోజు ప్రభుత్వం తాను చెప్పింది ఏమిటి? రక్తం, నీరు కలిసి ప్రవహించవని. ఇప్పుడు పాక్తో మ్యాచ్ ఎలా జరుగుతోంది? ఇది ప్రజల మనోభావాలను తోసిపుచినట్టు కాదా అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ వివాదంపై రాజకీయ పార్టీల స్పందన కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. శివసేన (UBT) నేత ఆదిత్య థాక్రే, మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ (Harbajan Singh) ఈ మ్యాచ్కు వ్యతిరేకంగా బహిరంగంగా అభిప్రాయాలు వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడే వరకు వారితో క్రికెట్ ఆడకూడదు అభిప్రాయపడ్డారు.
Asia Cup | అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం
ఈ అంశంపై ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (asaduddin owaisi) తాజాగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పహల్గామ్లో మన 26 మంది పౌరులను మతం అడిగి మరీ కాల్చి చంపిన పాకిస్తాన్తో క్రికెట్ మ్యాచ్ ఆడవద్దని చెప్పే దమ్ము మీకు లేదా? అంటూ అసోం, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రలుని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ మ్యాచ్ ద్వారా బీసీసీఐకి వచ్చే రూ.2 వేల కోట్లు, రూ.3 వేల కోట్లు 26 మంది పౌరుల ప్రాణాల కన్నా ఎక్కువయ్యాయా అంటూ మండిపడ్డారు. 26 మంది పౌరుల కుటుంబాలకు తాము అండగా నిలుస్తామంటూ ఒవైసీ పేర్కొన్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు అయితే ఢిల్లీలో పాకిస్తాన్ దిష్టి బొమ్మలని తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో ప్రజలు #BoycottINDvsPAK అనే హ్యాష్ట్యాగ్తో బహిరంగంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. “ఒక్క రోజు క్రికెట్ కోసం మృతుల త్యాగాన్ని మర్చిపోవచ్చా?” అనే ప్రశ్నలు పలువురు నెటిజన్ల పోస్టుల్లో కనిపిస్తున్నాయి. దీనిపై భారత ప్రభుత్వం వివరణ ఇస్తూ.. భారత్ పాక్ మధ్య ద్వైపాక్షిక సిరీస్లు నిర్వహించము. ఇది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC), ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ (ACC) నిబంధనల ప్రకారం జరిగే వ్యవహారం అని వెల్లడించింది.