అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు కలెక్టరేట్ (Collectorate) ముస్తాబైంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (Telangana Tourism Development Corporation) ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జెండావిష్కరణ చేయనున్నారు.
గతంలో ఇందిరాగాంధీ స్టేడియంలో (Indira Gandhi Stadium) రాష్ట్ర అవతరణ దినోత్సవాలు నిర్వహించే వారు. అయితే ప్రస్తుతం అకాల వర్షాల నేపథ్యంలో వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కలెక్టర్ కార్యాలయ గార్డెన్లో (Collector’s office garden) ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. కార్యక్రమంలో రాజీవ్ యువ వికాసం పథకం కింద మొదటి విడతలో భాగంగా రూ.50వేల రుణాలకు సంబంధించి ఎంపికైన లబ్ధిదారులు, ఇందిరమ్మ గృహాల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేయనున్నారు. పలు శాఖల శకటాలను ప్రదర్శించనున్నారు.