అక్షరటుడే, హైదరాబాద్ : Sharper Mind | మారుతున్న జీవనశైలి, ఒత్తిడితో కూడిన పనుల వల్ల చాలా మంది మతిమరుపు సమస్యను ఎదుర్కొంటున్నారు. ఏకాగ్రత లోపించడం, చిన్న చిన్న విషయాలను కూడా మరచిపోవడం సర్వసాధారణమైపోయింది.
అయితే, ఈ సమస్యకు పరిష్కారం మన వంటగదిలోనే ఉంది. మెదడు ఆరోగ్యానికి అవసరమైన పోషకాలను అందించే ఆహారాలను తీసుకోవడం ద్వారా జ్ఞాపకశక్తిని మెరుగుపరచుకోవచ్చు, మతిమరుపును తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు అధికంగా ఉండే ఆహారాలు మెదడు కణాలను చురుకుగా ఉంచుతాయి. ఈ కింద తెలిపిన ఆహారాలను రోజూ తీసుకుంటే మీ మెదడు శక్తివంతంగా పనిచేస్తుంది.
చేపలు : సాల్మన్(Salman Fish), సార్డినెస్ వంటి చేపలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, డీహెచ్ఏ (DHA) పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు కణాలను బలోపేతం చేసి, జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను పెంచుతాయి. వారానికి కనీసం రెండుసార్లు చేపలు తినడం మంచిది.
నట్స్, విత్తనాలు : బాదం, వాల్నట్స్, గుమ్మడి గింజలు(Pumpkin Seeds), పొద్దుతిరుగుడు గింజలలో విటమిన్ E, జింక్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి మెదడు కణాలకు నష్టం జరగకుండా కాపాడి, నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి.
ఆకుకూరలు : పాలకూర వంటి ఆకుకూరలలో విటమిన్ కె, ఫోలేట్, యాంటీఆక్సిడెంట్లు(Antioxidants) ఉంటాయి. ఇవి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, మెదడు కణాల వృద్ధికి సహాయపడతాయి.
గుడ్లు : ప్రతిరోజూ ఒక గుడ్డు తినడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. గుడ్డులో ఉండే కోలిన్ అనే పోషకం జ్ఞాపకశక్తిని పెంచే న్యూరోట్రాన్స్మిటర్ల ఉత్పత్తికి తోడ్పడుతుంది. విటమిన్ B12, B6 వంటివి వయసు పెరిగే కొద్దీ మెదడు కణాల క్షీణతను తగ్గిస్తాయి.
బెర్రీ పండ్లు : బ్లూబెర్రీస్(Blueberries), స్ట్రాబెర్రీస్(Strawberries) వంటి బెర్రీలలో ఫ్లేవనాయిడ్స్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మెదడుపై ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గించి, మెదడు కణాలను ఆరోగ్యంగా, చురుగ్గా ఉంచుతాయి.
పసుపు పాలు : పసుపులో ఉండే కర్కుమిన్ మెదడు కణాలను వృద్ధి చేసి, జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను పెంచుతుంది.
ఈ ఆహారాలను మీ రోజువారీ డైట్లో భాగం చేసుకోవడం ద్వారా మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.