అక్షరటుడే, వెబ్డెస్క్ : Kuwait | భారత్ (Bharat) నుంచి ఎంతో మంది బతుకు దెరువు కోసం కువైట్ వెళ్తుంటారు. అలాగే ఇతరులు సైతం ఆ దేశానికి వెళ్లి వస్తుంటారు. అయితే కువైట్ ప్రభుత్వం తాజాగా కస్టమ్స్ నిబంధనల్లో (Customs Rules) మార్పులు చేసింది. దాని ప్రకారం ఎక్కువ మొత్తంలో నగదు, విలువైన వస్తువులు తీసుకెళ్తే ముందుగానే ప్రకటించాల్సి ఉంటుంది. లేదంటే అధికారులు సీజ్ చేస్తారు.
Kuwait | ఎంత తీసుకెళ్లొచ్చు అంటే..
కువైట్ విమానాశ్రయాల్లో (Airports) కస్టమ్స్ రూల్స్ను మరింత కఠినం చేసింది. దీని ప్రకారం ఆ దేశం వెళ్లేవారు, అక్కడి నుంచి వచ్చే వారు 3 వేల కువైట్ దినార్ల కంటే ఎక్కువ నగదు, లేదంటే అంత విలువ చేసే వస్తువులను తీసుకెళ్లవద్దు. భారత కరెన్సీలో రూ.8,49,387 కంటే విలువైన వస్తువులు, నగదు తీసుకెళ్తే ముందుగానే అధికారులకు తెలపాలి. లేదంటే వాటిని అధికారులు ఎయిర్పోర్ట్లో సీజ్ చేస్తారు.
Kuwait | మనీలాండరింగ్ అరికట్టడానికి..
అక్రమంగా డబ్బు రవాణా (Money laundering), స్మగ్లింగ్ అరికట్టడానికి కువైట్ ప్రభుత్వం కొత్తగా నిబంధన తీసుకొచ్చింది. తాజా రూల్స్ ప్రకారం కువైట్ రాకపోకలు సాగించేవారు మూడు వేల దినార్ల కంటే విలువైన నగదు, వస్తువులు ఉంటే ముందుగానే అధికారులకు తెలియజేయాలి. వాటిలో డబ్బు, బంగారం, విలువైన లోహాలు, వస్తువులు, ఆభరణాలు, కాస్ట్లీ వాచీలు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నాయి. ఈ నిబంధన విదేశీ పర్యాటకులు, ప్రవాసులకు వర్తిస్తుందని ఆ దేశం తెలిపింది.
Kuwait | పత్రాలు దగ్గర ఉంచుకోవాలి
మూడు వేల కువైట్ దినార్ల కంటే విలువైన వస్తువులు, నగదు తీసుకెళ్తే కస్టమ్స్ చెక్పాయింట్ (Customs checkpoint) వద్ద వివరాలు ఇవ్వాలి. ఆన్లైన్ పోర్టల్లో కూడా ప్రకటించే అవకాశం ఉంది. అయితే సంబంధిత వస్తువుల కొనుగోలుకు సంబంధించిన రశీదులు, ఇన్వాయిస్లు వెంట పెట్టుకోవాలి. ఒకవేళ నగదు తీసుకెళ్తే.. అది ఎలా సంపాదించారు.. ఎక్కడి నుంచి వచ్చిందనే వివరాలు తెలపాల్సి ఉంటుంది. ముందే ప్రకటించకపోతే వాటిని అధికారులు సీజ్ చేసే అవకాశం ఉంది. అనంతరం ఫైన్ వేస్తారు. కువైట్ చట్టాల ప్రకారం ఇతర చర్యలు కూడా తీసుకుంటారు.