
అక్షరటుడే, వెబ్డెస్క్ : Mega DSC | మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయులుగా ఎంపికైన అభ్యర్థులకు అమరావతి(Amaravati)లో ఈ నెల 19వ తేదీన నియామక పత్రాలను అందజేయనున్నట్టు గతంలో ప్రకటించారు. ఈ కార్యక్రమం సచివాలయం వెనుక ఉన్న వెలగపూడి ప్రాంగణంలో అభినందన సభ రూపంలో నిర్వహించేందుకు విద్యాశాఖ(Education Department) భారీ ఏర్పాట్లు చేసింది.
అయితే ఊహించని విధంగా డీఎస్సీ అభ్యర్ధుల(DSC Candidates) అపాయింట్ మెంట్ లెటర్స్ పంపిణీ వాయిదా పడిందని విద్యాశాఖ అధికారులు తెలియజేశారు. త్వరలో కొత్త తేది ప్రకటిస్తామని అంటున్నారు. ఎందుకు వాయిదా వేసారనే కారణాలు తెలియరావడం లేదు. అభ్యర్ధులు ఇతర జిల్లాల నుండి వచ్చేందుకు ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేయగా, వాటిని క్యాన్సిల్ చేస్తున్నారు. వర్షాల ఎఫెక్ట్తోనే ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందని సమాచారం.
Mega DSC | ఎందుకు వాయిదా వేసారో మరి..
ఉత్తరాంధ్రకు చెందిన 2,660 మంది అభ్యర్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం(Vishakapatnam) జిల్లాల్లోని స్కూల్ అసిస్టెంట్లు, SGTలు, గురుకులాలు/మోడల్ పాఠశాలల ప్రిన్సిపాళ్లు, TGTలు, PGTలుగా ఎంపికైన అభ్యర్థుల కోసం ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అభ్యర్థుల వెంట ఒక కుటుంబ సభ్యుడికి కూడా సభలో పాల్గొనడానికి అనుమతి ఇచ్చారు. వీరిని అమరావతికి తీసుకెళ్లేందుకు సుమారు 118 బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు. బస్సులు ఈ నెల 18వ తేదీ ఉదయం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల నుంచి బయలుదేరాల్సి ఉండగా, అవన్నీ క్యాన్సిల్ అయ్యాయి.
ముందుగా ఈ కార్యక్రమాన్ని 19వ తేదీకి ప్లాన్ చేశారు. ఆ రోజు ఉదయం నిర్వహించబోయే అభినందన సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్, ఇతర ప్రముఖులు జిల్లాల నుంచి ఎంపికైన కొంతమంది అభ్యర్థులకు చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేయాలని అనుకున్నారు.. మిగతా అభ్యర్థులకు అదే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ల ద్వారా నియామక పత్రాలు పంపిణీ చేస్తామని ఓ ప్రకటనలో తెలిపారు. అయితే త్వరలో దీనిపై పూర్తి క్లారిటీ ఇవ్వనున్నారు. నియామక పత్రాల పంపిణీ అనంతరం ఎంపికైన అభ్యర్థులకు జిల్లాల వారీగా పాఠశాలల నిర్వహణ, బోధనా విధానాలు, పరిపాలనా వ్యవహారాలపై పది రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటివరకు డీఎస్సీ ద్వారా ఎంపికైన టీచర్లకు కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు, పాఠశాలలు కేటాయించేవారు. ఈసారి మాత్రం శిక్షణ అనంతరం స్కూళ్లకు పంపించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతి ఉద్యోగికి శిక్షణ అనివార్యమని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.