అక్షరటుడే, వెబ్డెస్క్ : Ration Cards | ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ దుకాణాల్లో రాగులు, జొన్నలు (Ragi and jowar) పంపిణీ చేస్తోంది. రాయలసీమలో ఏప్రిల్ నుంచే వీటిని అందిస్తుండగా.. తాజాగా ఉత్తర కోస్తాలో ప్రారంభించారు.
గతంలో రేషన్ దుకాణాల (ration shops) ద్వారా బియ్యంతోపాటు గోధుమలు, చక్కర, ఇతర సరుకులు అందించేవారు. రాను రాను ప్రభుత్వాలు బియ్యం సరఫరాకు మాత్రమే పరిమితం అయ్యాయి. దీంతో ప్రజలు ఇతర పోషక విలువలు కలిగిన ఆహారానికి దూరం అయ్యారు. దీంతో ఏపీ ప్రభుత్వం (AP government) మారుతున్న ఆహారపు అలవాట్లను దృష్టిలో పెట్టుకుని పేదలకు పోషక విలువలు కలిగిన తృణధాన్యాలను ఉచితంగానే అందిస్తోంది.
Ration Cards | అక్కడ ఏప్రిల్ నుంచి..
రాయలసీమలోని కర్నూల్, అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కడప, నంద్యాల జిల్లాల్లో ఏప్రిల్ నుంచే రేషన్ దుకాణాల్లో బియ్యం, చక్కరతో పాటు జొన్నలు, రాగులు పంపిణీ చేస్తున్నారు. డిసెంబర్ నుంచి విశాఖపట్నం (Visakhapatnam), అనకాపల్లి, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాలకు దీనిని విస్తరించారు. ప్రభుత్వం రేషన్ కార్డులోని ఒక్కో వ్యక్తికి 5 కిలోల చొప్పున బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తోంది. దీంతో బియ్యానికి బదులుగా 3 కేజీల వరకు రాగులు, జొన్నలు తీసుకునే వెసులుబాటు కల్పించింది.
Ration Cards | త్వరలో అన్ని జిల్లాలకు..
గతంలో ఎఫ్సీఐ రాగులు, జొన్నలను రాష్ట్రానికి కేటాయించేది. ప్రస్తుతం బియ్యం మాత్రమే సరఫరా చేస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే టెండరు ప్రక్రియ ద్వారా రాగులు, జొన్నలు సేకరించి రేషన్ కార్డుదారులకు (ration card holders) అందిస్తోంది. వీటిని తీసుకోవడానికి ప్రజలు ఆసక్తి చూపుతుండటంతో దశలవారీగా అన్ని జిల్లాలకు విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
