అక్షరటుడే, వెబ్డెస్క్ : New Ration Cards | ఎన్నో రోజుల నుండి ఎపీ ప్రజలు కొత్త రేషన్ కార్డ్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా, ఆ ఎదురుచూపులకు తెరపడింది. ఏపీలో త్వరలోనే కొత్త రేషన్ కార్డులు (New Ration Cards) జారీ చేయనున్నట్టు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. రేషన్ వ్యవస్థను మరింత ఆధునీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన డిజిటల్ రేషన్ కార్డులు (Digital Ration Cards) త్వరలో అందుబాటులోకి రానున్నాయని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆగస్టు 25వ తేదీ నుంచి వారం రోజుల పాటు కొత్త రేషన్ కార్డులను జారీ చేయనున్నట్లు తెలిపారు.
New Ration Cards | గుడ్ న్యూస్..
ఈ కొత్త కార్డులు డెబిట్ కార్డుల తరహాలో ఉంటాయని, వాటిపై రాజకీయ నాయకుల ఫొటోలు ఉండవని స్పష్టం చేశారు. క్యూఆర్ కోడ్ టెక్నాలజీతో (QR code technology) కూడిన ఈ కార్డులు, డైనమిక్ కీ రిజిస్టర్ వ్యవస్థతో అనుసంధానమవుతాయి. దీంతో ప్రతి లావాదేవీ వెంటనే ప్రభుత్వ డేటాబేస్లో నమోదు అవుతుందన్నారు. ఇప్పటివరకు 16 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చినట్లు మంత్రి వెల్లడించారు.
వీటిలో 15.32 లక్షల దరఖాస్తులు ఆమోదించబడ్డాయని, అలాగే 9.87 లక్షల మంది కొత్తగా పేర్లను నమోదు చేసుకునే అవకాశం పొందారని తెలిపారు. మొత్తం లబ్ధిదారుల సంఖ్య కోటి 45 లక్షలకు చేరగా, సభ్యులతో కలిపి ఇది 4 కోట్ల మార్క్ను దాటినట్లు మంత్రి (Minister Nadendla manohar) స్పష్టం చేశారు.
ఇక ఈకేవైసీ ప్రక్రియలో 5 ఏళ్లలోపు చిన్నపిల్లలు, 80 ఏళ్లు దాటిన వృద్ధులకు మినహాయింపు ఇచ్చినట్లు తెలిపారు. ప్రతి నెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ పంపిణీ జరుగుతుందని, వృద్ధుల కోసం ప్రత్యేకంగా 25నుంచి 30వ తేదీ వరకు డోర్ డెలివరీ సౌకర్యం కల్పించినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఈ కొత్త డిజిటల్ రేషన్ కార్డులతో రేషన్ వ్యవస్థ మరింత పారదర్శకంగా మారనుండగా, లబ్ధిదారులకు వేగవంతమైన సేవలందించే దిశగా ప్రభుత్వం మరో ముందడుగు వేసినట్లు స్పష్టమవుతోంది. మే నెల మొదటి వారం నుంచి రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించనుండగా, రేషన్ కార్డుల (Ration Cards) దరఖాస్తు నిరంతర ప్రక్రియ అని ప్రభుత్వం చెప్పుకొస్తుంది. కాగా, కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల ప్రింటింగ్ కోసం ఇటీవల ఏపీటీఎస్ ద్వారా టెండర్ ప్రక్రియ పూర్తి చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం కార్డుల ముద్రణ జరుగుతోందని చెప్పారు.