అక్షరటుడే, వెబ్డెస్క్ : Nalgonda | కర్నూల్ జిల్లాలో ఇటీవల ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమై 19 మంది సజీవ దహనం అయిన విషయం తెలిసిందే. ఆ ఘటన మరువక ముందే మరో ట్రావెల్స్ బస్సు కాలిపోయింది. ఈ ఘటన నల్గొండ జిల్లా (Nalgonda District)లో చోటు చేసుకుంది.
విహారి ట్రావెల్స్కు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తుండగా.. ప్రమాదం చోటు చేసుకుంది. విజయవాడ-హైదరాబాద్ హైవేపై నల్గొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి వద్ద బస్సులో మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును పక్కకు ఆపాడు. దీంతో ప్రయాణికులు అద్దాలు పగులకొట్టుకొని కిందకు దూకారు. అనంతరం బస్సు పూర్తిగా కాలిపోయింది. ఘటన సమయంలో బస్సులో మొత్తం 29 మంది ప్రయాణికులు ఉన్నారు.
Nalgonda | టీ బ్రేక్ ఆగిన కాసేపటికే..
డ్రైవర్ బస్సును టీ బ్రేక్ కోసం చౌటుప్పల్ (Choutuppal) వద్ద ఆపాడు. అనంతరం బస్సు బయలు దేరిన పది నిమిషాలకే ఇంజిన్లో మంటలు రావడాన్ని డ్రైవర్ గమనించాడు. వెంటనే ప్రయాణికులకు సమాచారం ఇచ్చి బస్సును ఆపాడు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఏ మాత్రం ఆలస్యం అయినా భారీ ప్రాణనష్టం జరిగేది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. రెండు ఫైర్ ఇంజిన్లు (Fire Engines) ఘటన స్థలానికి చేరుకున్నాయి. అయితే అప్పటికే బస్సు పూర్తిగా కాలిపోయింది.
Nalgonda | ప్రయాణికుల ఆందోళన
ఇటీవల బస్సు ప్రమాదాలు చోటు చేసుకుంటుండటంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్కు చెందిన బస్సు దగ్ధమై 19 మంది మృతి చెందిన విషయం తెలిసింది. చెవేళ్ల వద్ద ఆర్టీసీ బస్సును కంకర లోడ్తో వెళ్తున్న లారీ ఢీకొనడంతో 19 మంది చనిపోయారు. ఇటీవల పలు ట్రావెల్స్ బస్సులు ప్రమాదాలకు గురి అవుతున్నాయి. దీంతో బస్సు ఎక్కాలంటే ప్రయాణికులు భయపడుతున్నారు.
