అక్షరటుడే, వెబ్డెస్క్: Anish Dayal | సీఆర్పీఎఫ్ మాజీ డైరెక్టర్ జనరల్, సీనియర్ ఐపీఎస్ అధికారి అనిష్ దయాల్ సింగ్ డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ (Deputy National Security Advisor)గా నియమితులయ్యారు. దేశ భద్రతకు సంబంధించి ఎన్నో ఆపరేషన్లలో పాల్గొన్న ఆయనకు విశిష్ట అనుభవం ఉంది. జమ్మూ కాశ్మీర్ (Jammu and Kashmir), వామపక్ష తీవ్రవాదం, ఈశాన్య ప్రాంతంలో తిరుగుబాటు వంటి అంతర్గత భద్రతా సమస్యల పరిష్కారంలో సింగ్ కీలక పాత్ర పోషించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ (National Security Advisor Ajit Doval) ఆధ్వర్యంలో ఇప్పటికే పని చేస్తున్న రా మాజీ చీఫ్ రాజిందర్ ఖన్నా, రిటైర్డ్ IPS అధికారి T.V. రవిచంద్రన్, మాజీ దౌత్యవేత్త పవన్ కపూర్లతో కూడిన బృందంలో అనిశ్ దయాల్ సింగ్ ఇప్పుడు చేరారు.
Anish Dayal | విశేష అనుభవం
మణిపూర్ కేడర్కు చెందిన 1988 బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి అనిష్ దయాల్ సింగ్ గతేడాది డిసెంబర్ లో పదవీ విరమణ చేశారు, ఫీల్డ్ ఇంటెలిజెన్స్, పోలీసింగ్, పారామిలిటరీ నాయకత్వం (paramilitary leadership), విధాన సంస్కరణలలో 35 సంవత్సరాల పదవీ కాలంలో తనదైన ముద్ర వేసుకున్నారు. భారతదేశంలోని రెండు ప్రధాన పారామిలిటరీ దళాలైన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (Central Reserve Police Force), ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) లకు నాయకత్వం వహించిన ఆయన అంతకు ముందు దాదాపు మూడు దశాబ్దాలుగా ఇంటెలిజెన్స్ బ్యూరో (IB)లో పనిచేశారు.
జమ్మూ కాశ్మీర్, ఈశాన్య ప్రాంతాలలో ముఖ్యంగా తిరుగుబాటును అణచివేయడంలో, అంతర్గత భద్రతా కార్యకలాపాలను నియంత్రించడంలో సింగ్ ఐబీలో పని చేసిన అనుభవం ఎంతగానో దోహదపడింది. CRPF డైరెక్టర్ జనరల్గా సింగ్ కీలకమైన దశలో దళానికి నాయకత్వం వహించారు. 36 కంటే ఎక్కువ ఫార్వర్డ్ ఆపరేటింగ్ స్థావరాలను ఏర్పాటు చేయడం ద్వారా, క్షేత్రస్థాయిలో సామర్థ్యాన్ని పెంచడానికి నాలుగు కొత్త బెటాలియన్లను నెలకొల్పడం ద్వారా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో సీఆర్పీఎఫ్ పరిధిని పెంచడంలో విస్తృతం చేయడంలో కీలక పాత్ర పోషించారు.
2024 లోక్సభ ఎన్నికలు (Lok Sabha elections), జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ తర్వాత జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ భద్రతా ఏర్పాట్లను ఆయనే పర్యవేక్షించారు. 130 CRPF బెటాలియన్ల పునర్వ్యవస్థీకరణ, బెటాలియన్ ప్రధాన కార్యాలయం, స్వస్థల కేంద్రాల మధ్య సగటు దూరాన్ని 1,200 కి.మీ నుండి 500 కి.మీకి తగ్గించడం వంటివి సింగ్ తీసుకొచ్చిన నిర్మాణాత్మక సంస్కరణలలో ప్రధానమైనవి. ఈ మార్పు సిబ్బందికి తమ కుటుంబాలతో ఎక్కువ సమయం గడిపేందుకు అవకాశం కల్పించింది. దేశవ్యాప్తంగా ఉన్న కంపెనీ కమాండర్లతో నేరుగా సంభాషించడానికి వీలు కల్పించే “సంవాద్” సెషన్లను ఆయన ప్రవేశపెట్టారు. ఈ సెషన్లు స్థానిక అభిప్రాయాన్ని అగ్ర నాయకత్వానికి చేరవేయడంలో సహాయపడ్డాయి. పదోన్నతలు సమస్యలను పరిష్కరించడంలో ఆయన కీలకంగా వ్యవహరించారు.