అక్షరటుడే, వెబ్డెస్క్ : CM Revanth Reddy | హైదరాబాద్కు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (IIM) మంజూరు చేయాలని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan)ను సీఎం రేవంత్రెడ్డి కోరారు. టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, ఏరో స్పేస్, డిఫెన్స్, లాజిస్టిక్స్, అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లో ముందున్న హైదరాబాద్లో ఐఐఎం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో పార్లమెంట్లోని ఛాంబర్లో భేటీ అయ్యారు. ఐఐఎం ఏర్పాటుకు అవసరమైన 200 ఎకరాల భూమిని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ప్రాంగణంలో గుర్తించిన విషయాన్ని తెలిపారు. ఐఐఎం తరగతులు వెంటనే ప్రారంభించేందుకు ట్రాన్సిట్ క్యాంపస్ సిద్ధంగా ఉందన్నారు. అందుకు అవసరమైన అనుమతులు మంజూరు చేయడంతో పాటు వసతులు కల్పనకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వివరించారు.
CM Revanth Reddy | కేంద్రీయ విద్యాలయాలు
తెలంగాణలో పెరిగిన జిల్లాల సంఖ్యకు అనుగుణంగా 9 కేంద్రీయ విద్యాలయాలు, 16 నవోదయ విద్యాలయాలను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆసిఫాబాద్, భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, నారాయణపేట, నాగర్కర్నూల్, సూర్యాపేట, వికారాబాద్, నిర్మల్ జిల్లాల్లో కేంద్రీయ విద్యాలయాలు, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, జనగాం, జోగులాంబ గద్వాల, మహబూబాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మెదక్, ములుగు, నారాయణపేట, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, వికారాబాద్, వనపర్తి, భువనగిరి, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలో జవహర్ నవోదయ విద్యాలయాలు వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు. విద్యాలయాల ఏర్పాటుకు అవసరమైన స్థలం, ఇతర వసతులు కల్పించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు.