అక్షరటుడే, కామారెడ్డి: RTC | కామారెడ్డికి చెందిన మహిళ కండక్టర్ తన నిజాయితీని చాటుకున్నారు. బస్సులో ఓ ప్రయాణికురాలు తన బ్యాగ్ మర్చిపోగా తిరిగి అప్పగించారు. వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి (Kamreddy Depot) డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బుధవారం (RTC Bus) జేబీఎస్ (JBS) వరకు వెళ్లింది. అందులో ఎక్కిన ఒక ప్రయాణికురాలు తన బ్యాగును బస్సులో మర్చిపోయి జేబీఎస్లో దిగిపోయింది.
బస్సులో ఉన్న బ్యాగును గమనించిన కండక్టర్ సువర్ణ దానిని తీసుకొని తన దగ్గర ఉంచుకున్నారు. బస్సు దిగిపోయిన ప్రయాణికురాలు తన వద్ద బ్యాగు కనిపించకపోయేసరికి తిరిగి బస్స్టాప్ వద్దకు చేరుకున్నారు. అక్కడ ఉన్న కండక్టర్ను సంప్రదించగా బ్యాగు తన వద్ద ఉందని తెలిపారు. బ్యాగులో నాలుగు తులాల బంగారం, సెల్ ఫోన్తో పాటు నగదు ఉండగా వాటిని ప్రయాణికురాలికి కండక్టర్ సువర్ణ అప్పగించారు. నిజాయితీ చాటుకున్న కండక్టర్ సువర్ణను పలువురు ప్రయాణికులు అభినందించారు.