అక్షరటుడే, వెబ్డెస్క్: Naxal Leader Encounter | మావోయిస్ట్లకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా (Bijapur District)లో జరిగిన ఎన్కౌంటర్లో కీలక నేత హతం అయ్యారు.బస్తర్ డివిజన్లోని బీజాపూర్లో గురువారం ఉదయం ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి.
మావోయిస్టులు (Maoists) ఉన్నారనే సమాచారం మేరకు బలగాలు కూంబింగ్ (Coombing) చేపట్టాయి. ఈ క్రమంలో ఉదయం 7:30 గంటలకు కాల్పులు ప్రారంభం అయ్యాయి. ఇంకా ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు బలగాలు ఒక నక్సలైట్ మృతదేహాన్ని, ఎకే–47 రైఫిల్ను స్వాధీనం చేసుకున్నాయి. ఆపరేషన్ ముగిసిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
Naxal Leader Encounter | ఉదమ్ సింగ్ హతం
ఈ ఎన్కౌంటర్లో నక్సల్ కమాండర్, ఈ ప్రాంతంలో చురుగ్గా ఉన్న అగ్ర నాయకుడు ఉధమ్ సింగ్ చనిపోయినట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. భద్రతా సంస్థలు ఈ ప్రాంతమంతా సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. బస్తర్ డివిజన్లో నక్సలైట్ వ్యతిరేక ఆపరేషన్లో భద్రతా దళాలు మరో ప్రధాన సంకేత విజయాన్ని సాధించాయి. సుక్మా జిల్లా (Sukma District)లోని గోగుండ కొండపై రామన్న స్మారక చిహ్నాన్ని కూల్చివేశాయి. ఈ ప్రాంతం కొంతకాలంగా మావోయిస్టుల నియంత్రణలో ఉంది. అయితే కొన్ని నెలల క్రితం ఇక్కడ 74వ బెటాలియన్ ఒక ఫార్వర్డ్ ఆపరేషనల్ బేస్ను ఏర్పాటు చేసింది. తాజాగా రామన్న స్మారక చిహ్నాన్ని కూల్చివేసింది.
Naxal Leader Encounter | 23 మంది మృతి
ఛత్తీసగఢ్ (Chhattisgarh)లో ఈ ఏడాది ఇప్పటివరకు జరిగిన వివిధ ఎన్కౌంటర్లలో కనీసం 23 మంది మావోయిస్టులు మరణించారు. జనవరి 3న బస్తర్ ప్రాంతంలో జరిగిన రెండు ఎన్కౌంటర్లలో 14 మంది చనిపోయారు. బస్తర్ ప్రాంతంలో బీజాపూర్తో సహా ఏడు జిల్లాలు ఉన్నాయి. గత సంవత్సరం ఛత్తీస్గఢ్లో భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లలో మొత్తం 285 మంది నక్సల్స్ మరణించారు.