అక్షరటుడే, వెబ్డెస్క్: US President Trump | ఇండియాతో సంబంధాలు దూరం చేసుకోవడంపై స్వదేశంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trump) మరోసారి తన వాక్చాతుర్యాన్ని ప్రదర్శించారు. న్యూఢిల్లీతో గత వాణిజ్య ఒప్పందాలను ఏకపక్ష విపత్తుగా అభివర్ణించారు.
చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) చైనా అధ్యక్షుడు జి జిన్ పింగ్ (China President Xi Jinping), రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో (Russian President Vladimir Putin) సమావేశమైన గంటల వ్యవధిలోనే ట్రంప్ సుంకాల విధింపును సమర్థించుకుంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. సుంకాల నేపథ్యంలో భారత్ టారిఫ్లను పూర్తిగా తగ్గించేందుకు ప్రతిపాదించిందని, కానీ ఇప్పటికే చాలా ఆలస్యమైందని పేర్కొన్నారు. ఇది ఎప్పుడో చేయాల్సిన పని అని ట్రూత్ సోషల్లో చేసిన పోస్టులో పేర్కొన్నారు.
US President Trump | ఏకపక్ష సంబంధాలే..
ఇండియా ఇప్పటిదాకా అమెరికాపై భారీగా సుంకాలు (heavy tariffs) విధించిందని ట్రంప్ ఆరోపించారు. ఆ దేశానికి అతిపెద్ద వినియోగదారు అయిన తమపై దశాబ్దాలుగా సుంకాలు వేస్తోందని, అదే సమయంలో తమ నుంచి తక్కువ కొనుగోలు చేస్తూ రష్యా నుంచి చమురు, రక్షణ ఉత్పత్తులు కొనుగోలు చేస్తోందని పేర్కొన్నారు. “భారతదేశంతో మేము చాలా తక్కువ వ్యాపారం చేస్తాము. కానీ వారు మాతో అపారమైన వ్యాపారం చేస్తారు. మరో మాటలో చెప్పాలంటే, వారు మాకు భారీ మొత్తంలో వస్తువులను అమ్ముతారు. మేము వారికి అతిపెద్ద ‘క్లయింట్’, కానీ మేము మాత్రం వారికి చాలా తక్కువగా అమ్ముతాం.
ఇప్పటివరకు జరిగిందంతా పూర్తిగా ఏకపక్ష సంబంధం. ఇండియా చాలా దశాబ్దాలుగా మాపై అత్యధిక సుంకాలు విధించింది. అదే సమయంలో మేము ఆ దేశంతో ఇది కొనసాగుతోంది. కారణం ఏమిటంటే, భారతదేశం ఇప్పటివరకు మాకు ఇంత ఎక్కువ సుంకాలు విధించింది, కానీ మేము ఆ స్థాయిలో చేయలేకపోయం. ఇది పూర్తిగా ఏకపక్ష విపత్తు!” అని పోస్టులో పేర్కొన్నారు.
US President Trump | సుంకాలను తగ్గించుకోవడానికి ముందుకొచ్చింది
తాను అర్థం చేసుకున్నట్లుగా భారతదేశం-అమెరికా వాణిజ్యాన్ని (India-US trade) కొద్దిమంది మాత్రమే అర్థం చేసుకుంటారన్నారు. ఇండియా అమెరికా కంటే రష్యా నుంచే చమురు, సైనిక ఉత్పత్తులను ఎక్కువగా కొనుగోలు చేస్తోందని ట్రంప్ తెలిపారు. అయితే, భారతదేశం ఇప్పుడు తన సుంకాలను సున్నాకి తగ్గించుకుంటామని ప్రతిపాదించిందని, కానీ ఈ చర్య చాలా కాలంగా వాయిదా పడిందని ఆయన అన్నారు. “వారు ఇప్పుడు తమ సుంకాలను పూర్తిగా తగ్గించుకుంటామని ప్రతిపాదించారు, కానీ ఇప్పటికే చాలా ఆలస్యమైంది. వారు సంవత్సరాల క్రితమే అలా చేసి ఉండాల్సింది” అని ఆయన పేర్కొన్నారు.