అక్షరటుడే, వెబ్డెస్క్ : TTD Tickets | తిరుమల (Tirumala)లో కొలువుదీరిన కలియుగ దైవం వేంకటేశ్వరస్వామిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. స్వామి దర్శనంతో ఎంతో మంది పులకించిపోతారు. చాలా మంది భక్తులు ఆన్లైన్లో టికెట్లను బుక్ చేసుకొని వేంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తుంటారు. ఫిబ్రవరి (Febraury Quota) నెలకు సంబంధించిన దర్శన టికెట్ల విడుదల వివరాలను తాజాగా టీటీడీ వెల్లడించింది.
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల (సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ)కు సంబంధించిన ఫిబ్రవరి నెల కోటాను నవంబర్ 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం నవంబర్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. టికెట్లు పొందిన వారు నవంబర్ 20 నుంచి 22 మధ్యాహ్నం 12 గంటలలోపు నగదు చెల్లించాలి. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవం టికెట్లను నవంబర్ 21న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది.
TTD Tickets | వర్చువల్ సేవల కోటా టికెట్లు
వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను ఈ నెల 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ అధికారులు విడుదల చేస్తారు. అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు, శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో రిలీజ్ చేస్తారు. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను ఈ నెల 24న మధ్యాహ్నం 3 గంటలకు, ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 25న ఉదయం 10 గంటలకు టీటీడీ వెబ్సైట్లో పెట్టనున్నారు. అలాగే ఫిబ్రవరి నెలకు సంబంధించి తిరుమల, తిరుపతి గదుల కోటాను ఈ నెల 25న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్లో మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
