అక్షరటుడే, వెబ్డెస్క్ : Weather Updates | రాష్ట్రంలో మళ్లీ భారీ వర్షాలు (Heavy Rains) పడుతాయని వాతావరణ శాఖ (IMD) అధికారులు హెచ్చరించారు. రానున్న మూడు రోజులు పలు జిల్లాల్లో కుండపోత వాన కురిసే అవకాశం ఉందన్నారు.
వారం రోజులుగా రాష్ట్రాన్ని వానలు వీడటం లేదు. నిత్యం వర్షాలు పడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే వారం రోజులుగా అక్కడక్కడ మాత్రమే వానలు పడ్డాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం (LPA) కారణంగా గురు, శుక్ర, శనివారాల్లో మాత్రం విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు.
Weather Updates | ఆ జిల్లాల్లో జాగ్రత్త
ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, జగిత్యాల, సిరిసిల్ల, సిద్దిపేట, ములుగు, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, కొత్తగూడెం, ఖమ్మం, జనగామ జిల్లాల్లో గురువారం అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆదిలాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, సూర్యాపేట జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతాయి. హైదరాబాద్ (Hyderabad) నగరంలో మధ్యాహ్నం వరకు తేలికపాటి వర్షాలు పడుతాయి. సాయంత్రం పూట మోస్తరు వాన పడే ఛాన్స్ ఉంది.
Weather Updates | 26, 27 తేదీల్లో..
అల్పపీడనం కారణంగా శుక్రవారం, శనివారం పలు జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టించే అవకాశం ఉంది. అతి భారీ వర్షాలతో పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, ఉమ్మడి మెదక్, కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, వికారాబాద్, నారాయణపేట, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వరంగల్, హన్మకొండ, జనగామ, మహబూబాబాద్, కొత్తగూడెం, భువనగిరి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయి. మిగతా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అనవసర ప్రయాణాలు చేయొద్దన్నారు. వాగులు, నదుల సమీపంలోకి వెళ్లొద్దని హెచ్చరించారు.