అక్షరటుడే, వెబ్డెస్క్ : Tirumala | తిరుమల శ్రీవారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. చాలా మంది సొంత వాహనాలు, టూరిస్ట్ వెహికిల్స్(Tourist Vehicles)లో స్వామి దర్శనానికి వస్తుంటారు. అయితే ప్రస్తుతం ఫాస్టాగ్ లేకున్నా.. తిరుమలలోకి అనుమతిస్తున్నారు. అయితే ఇక నుంచి ఫాస్టాగ్(FASTag) ఉంటేనే తిరుమలలోకి ప్రవేశం కల్పిస్తామని టీటీడీ స్పష్టం చేసింది. ఈ నెల 15 నుంచి కొత్త విధానం అమలు చేస్తామని ప్రకటించింది.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఫాస్టాగ్ విధానం అందుబాటులోకి తెచ్చింది. టోల్ ప్లాజా(Toll Plaza)ల వద్ద వాహనదారుల సమయం వృథా అవకుండా.. వేగంగా వెళ్లడానికి ఫాస్టాగ్లను తీసుకొచ్చింది. తాజాగా వార్షిక పాస్లను కూడా కేంద్రం తీసుకు రానుంది. అయితే ప్రస్తుతం ఫాస్టాగ్ లేకున్నా తిరుమల(Tirumala)లోకి వాహనాలను అనుమతిస్తున్నారు. దీంతో పలు సమయాల్లో అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాలు జామ్ అవుతున్నాయి. ఫలితంగా భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. భక్తుల భద్రత, రద్దీని దృష్టిలో పెట్టుకొని ఫాస్టాగ్ విధానం తప్పనిసరి చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.
Tirumala | అలిపిరి కేంద్రం వద్ద..
తిరుమలలోని అలిపిరి తనిఖీ కేంద్రం(Alipiri Checkpoint) వద్ద ఫాస్టాగ్లను చెక్ చేస్తారు. ఒక వేళ వాహనాలకు ఫాస్టాగ్ లేకపోతే తిరమలలోకి అనుమతించరు. భక్తులకు మెరుగైన భద్రత, అధిక రద్దీ నివారణ, పారదర్శక సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ నెల 15 నుంచి ఫాస్టాగ్ తప్పనిసరి చేసినట్లు టీటీడీ ప్రకటించింది. అయితే వాహనదారుల సౌకర్యార్థం అలిపిరి కేంద్రం వద్ద ఫాస్టాగ్లు జారీ చేస్తామని ప్రకటించింది. ఐసీఐసీఐ బ్యాంక్(ICICI Bank) సహకారంతో వీటిని జారీ చేస్తామని.. ఫాస్టాగ్ లేని వాహనదారులు తీసుకొని తిరుమలకు వెళ్లొచ్చని వివరించింది. ఫాస్టాగ్ల జారీ కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశామని పేర్కొంది. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తమకు సహకరించాలని టీటీడీ అధికారులు కోరారు.
