అక్షరటుడే, వెబ్డెస్క్: Tirumala Brahmotsavam | తిరుమలలో కొలువైన కలియుగ దైవం వేంకటేశ్వర స్వామిని (Venkateswara Swamy) నిత్యం వేలాది మంది భక్తులు దర్శనం చేసుకుంటారు. దేశం నలుమూలల నుంచి శ్రీవారి దర్శనానికి భక్తులు వస్తుంటారు. గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండే స్వామివారిని దర్శనం చేసుకుంటారు. అయితే ఏటా జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు(Srivari Brahmotsavam) లక్షలాది భక్తులు తరలి వస్తారు. స్వామి వారు వివిధ వాహనాలపై భక్తుల వద్దకే వచ్చి దర్శనమిస్తారు. ఈ అద్భుత ఘట్టం చూడడానికి లక్షలాది మంది భక్తులు తిరుమల క్షేత్రానికి వస్తారు. ఈ ఏడాది సెప్టెంబర్ 24 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.
Tirumala Brahmotsavam | ఏర్పాట్లపై సమీక్ష
తిరుమలలో సెప్టెంబర్ 24 నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు (Srivari Salakatla Brahmotsavam) ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో టీటీడీ సీవీ, ఎస్వో మురళీకృష్ణ విజిలెన్స్, ఫైర్, ఎస్పీఎఫ్ అధికారులతో అన్నమయ్య భవన్లో శనివారం సన్నాహక సమావేశం నిర్వహించారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ రూం ద్వారా తిరుమలలోని ప్రతి ప్రాంతంపై నిఘా ఉంచాలని ఆదేశించారు.
Tirumala Brahmotsavam | పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం
శ్రీవారి బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా కొనసాగనున్నాయి. ఇందులో భాగంగా మొదటి రోజు సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ క్రమంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని మురళీ కృష్ణ ఆదేశించారు. బ్రహ్మోత్సవాల్లో ముఖ్య రోజులైన పెద్దశేష వాహనం, గరుడ వాహనం, రథోత్సవం, చక్రస్నానం రోజుల్లో భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
Tirumala Brahmotsavam | భక్తులకు ఇబ్బందులు లేకుండా..
బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారి వాహన సేవలను తిలకించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. గ్యాలరీలు, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను ప్రణాళికాబద్ధంగా రూపొందించాలన్నారు. వాహనాల రద్దీని దృష్టిలో పెట్టుకొని పార్కింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు. ట్రాఫిక్ జాం కాకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు. సమావేశంలో టీటీడీ వీజీవోలు రామ్ కుమార్, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.
Tirumala Brahmotsavam | తొమ్మిది రోజుల పాటు..
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఏటా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ వేడుకలను తిలకించడానికి భక్తజనం తరలి వస్తారు. స్వామివారు గరుడ వాహనం, పెద్ద శేష వాహనం, చిన్నశేష వాహనం మొదలైన వాటిపై మాఢవీధుల్లో విహరిస్తారు. రథోత్సవం, స్వర్ణ రథోత్సవం లాంటి ముఖ్యమైన కార్యక్రమాలు కూడా ఉంటాయి, స్వామివారు భక్తులకు చెంతకు వచ్చి దర్శనం ఇస్తారు.