అక్షరటుడే, వెబ్డెస్క్ : Ajit Pawar Funeral | మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అంత్యక్రియలు ముగిశాయి. బారామతి (Baramati)లోని విద్యా ప్రతిష్ఠాన్ మైదానంలో గురువారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించారు.
బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతిచెందిన విషయం తెలిసిందే. ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కేంద్ర మంత్రులు అమిత్ షా (Union Minister Amit Shah), నితిన్ గడ్కరీ, మాజీ కేంద్ర మంత్రి శరద్ పవార్, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ (CM Devendra Fadnavis), ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే (Eknath Shinde)తో సహా అశేష సంఖ్యలో అభిమానులు, రాజకీయ నాయకులు హాజరై నివాళులర్పించారు. అజిత్ పవార్ చితికి నిప్పంటించిన తర్వాత, ఆయన అంత్యక్రియలకు హాజరైన వేలాది మంది ప్రజలు “అజిత్ దాదా అమర్ రహే” అని నినాదాలు చేశారు.
Ajit Pawar Funeral | విచారణ జరిపించాలి
అజిత్ పవార్ ప్రాణాలను బలిగొన్న విమాన ప్రమాదంపై పూర్తిస్థాయి, నిష్పక్షపాత విచారణ జరపాలని శివసేన (యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్ గురువారం డిమాండ్ చేశారు. కేవలం సంతాపం తెలపడం సరిపోదని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా పదేపదే జరుగుతున్న చార్టర్ విమాన ప్రమాదాలను ప్రస్తావిస్తూ, దీనికి సాంకేతిక సమస్యలు, రాడార్ వైఫల్యాలు లేదా విమానాశ్రయ సంబంధిత సమస్యలు కారణమా అని రౌత్ ప్రశ్నించారు. కారణాలను కనుగొని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా నిరోధించడానికి చర్యలు చేపట్టాలన్నారు.
Ajit Pawar Funeral | సంతాప దినాలు
కాగా విమాన ప్రమాదంలో అజిత్ పవార్తో పాటు పైలట్ కెప్టెన్ సుమిత్ కపూర్, కో-పైలట్ శాంభవి పాఠక్, ఫ్లైట్ అటెండెంట్ పింకీ మాలి, వ్యక్తిగత భద్రతా అధికారి విదీప్ జాదవ్ మరణించారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మహారాష్ట్ర ప్రభుత్వం (Maharashtra Government) మూడు రోజుల రాష్ట్ర సంతాప దినాలు ప్రకటించింది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కింద పనిచేసే AAIB ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తోంది.