Homeఅంతర్జాతీయంPakistan | భారత్‌ చేతిలో కీలుబొమ్మగా అఫ్గాన్‌.. పాక్‌ రక్షణ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

Pakistan | భారత్‌ చేతిలో కీలుబొమ్మగా అఫ్గాన్‌.. పాక్‌ రక్షణ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

పాకిస్థాన్​ రక్షణశాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ మరోసారి భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. అఫ్గానిస్థాన్​తో శాంతి చర్చలు విఫలం కావడానికి భారత్​ కారణమని ఆయన ఆరోపించారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pakistan | పాకిస్థాన్​ రక్షణశాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ (Khawaja Asif) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అఫ్గానిస్థాన్​ (Afghanistan)తో ఘర్షణలపై స్పందిస్తూ.. భారత్​పై ఆరోపణలు చేశారు. భారత్​ చేతిలో అఫ్గాన్​ కీలుబొమ్మగా మారిందన్నారు.

ఆపరేషన్​ సిందూర్​ (Operation Sindoor)తో బుద్ధి చెప్పినా.. పాకిస్థాన్​ నేతల తీరులో మార్పు రావడం లేదు. భారత వ్యతిరేక వ్యాఖ్యలతో కవ్వింపులకు పాల్పడుతున్నారు. ఓ వైపు బలూచిస్థాన్​ వేర్పాటువాదులు, మరోవైపు అఫ్గానిస్థాన్​ దాడులతో బిత్తరపోతున్న పాక్​ ప్రభుత్వం.. ఆ నెపాన్ని భారత్​పై నెడుతోంది. వారితో పోరాడలేక పాక్​ దళాలు పారిపోతుంటే.. పాక్​ మంత్రి మాత్రం ఇస్లామాబాద్‌పై దాడి జరిగితే.. దానికి 50 రెట్ల తీవ్రతతో ప్రతిదాడి చేస్తామని హెచ్చరించారు.

Pakistan | శాంతిచర్చలు విఫలం

పాక్​–అఫ్గాన్​ మధ్య కొంతకాలంగా ఘర్షణలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. పాకిస్థాన్​ వైమానిక దాడులు చేయడంతో తాలిబన్​ ప్రభుత్వం ప్రతిదాడులు చేసింది. అనంతరం రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. అయితే ఇరుదేశాల మధ్య శాంతి చర్చలు విఫలం అయ్యాయి. దీనిపై పాక్​ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ స్పందిస్తూ.. కాబుల్​ (Kabul)లోని ప్రజలు ఢిల్లీ నియంత్రణలో ఉన్నారన్నారు. భారత్‌ చేతిలో అఫ్గాన్‌ కీలుబొమ్మగా మారిందని విమర్శలు చేశారు. అఫ్గాన్​తో ఒప్పందానికి దగ్గరగా వెళ్లినప్పుడల్లా.. కొందరి జోక్యంతో అది ఉపసంహరణకు గురవుతుందని భారత్​ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.

Pakistan | అఫ్గాన్​ హెచ్చరికలు

తుర్కియే (Turkey)లో ఇరుదేశాల మధ్య జరిగిన చర్చలు విఫలం అయ్యాయి. తమ దేశంలో దాడులకు కారణమైన ఉగ్రవాదులపై చర్యలు తీసుకునేందుకు తాలిబన్‌ ప్రభుత్వం నిరాకరించడంతో విఫలమయ్యాయని పాక్​ చెబుతోంది. ఈ క్రమంలో పాకిస్థాన్​ను తాలిబన్​ ప్రభుత్వం హెచ్చరించింది. తమ భూభాగంపై ఎలాంటి దాడి జరిగినా.. ఇస్లామాబాద్‌ లక్ష్యంగా తమ ప్రతీకార చర్యలు ఉంటాయని పేర్కొంది. మరోవైపు పాక్​ రక్షణ మంత్రి సైతం.. అఫ్గాన్‌ బెదిరింపులపై స్పందించారు. తమ దేశంలో ఉగ్రవాదానికి అఫ్గానిస్థాన్​ కారణమని ఆరోపించారు. చర్చలు విఫలమైతే.. ఆ దేశంతో పూర్తిస్థాయి యుద్ధానికి దారి తీయొచ్చన్నారు.

కాగా.. తమ వెనక భారత్​ ఉందని పాక్​ ఆరోపణలను గతంలోనే తాలిబన్లు ఖండించారు. ఇతర దేశాలకు తమ భూ భాగాన్ని ఉపయోగించుకునే అవకాశం ఇవ్వమని స్పష్టం చేశారు. స్వతంత్ర దేశంగా భారత్​తో సంబంధాలను కొనసాగిస్తున్నారని తెలిపారు.