అక్షరటుడే, వెబ్డెస్క్ : ACB Raid | అవినీతి అధికారులు రెచ్చిపోతున్నారు. తమ వద్దకు వివిధ పనుల నిమిత్తం వచ్చే వారిని డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. పైసలు ఇస్తేనే పనులు చేస్తున్నారు. తాజాగా రైతు బీమా కోసం డబ్బులు డిమాండ్ చేసిన ఏఈవోను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా మరిపెడ గ్రామానికి చెందిన రైతు ఇటీవల మరణించాడు. దీంతో అతడి కుమారుడు రైతు బీమా (Rythu Bima) కోసం దరఖాస్తు చేశాడు. బీమా అప్లికేషన్ను ప్రాసెస్ చేయడానికి ఆనేపురం గ్రామానికి చెందిన ఏఈవో సందీప్ (AEO Sandeep) రూ.20వేలు లంచం డిమాండ్ చేశాడు. బాధితుడు బతిమిలాడగా రూ.15 వేలకు ఒప్పుకున్నాడు. ఈ విషయమై బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు గురువారం రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా.. ఏఈవో సందీప్ను అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
ACB Raid | లంచం ఇవ్వొద్దు
ప్రజలు అధికారులకు లంచాలు ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు (ACB Officers) సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీకి ఫోన్ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number), వాట్సాప్ నంబర్ 9440446106కు సమాచారం అందిస్తే అవినీతి అధికారుల పని పడతామని భరోసా ఇస్తున్నారు.
ఎంత మొత్తం లంచం అడిగినా.. వస్తు రూపంలో బహుమతులు అడిగినా తమకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పనులు కావేమోనని పలువురు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఎలాంటి భయం వద్దని, ఆ పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.
