అక్షరటుడే, వెబ్డెస్క్ : Indiramma Illu | పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక పూర్తవగా ఇళ్ల నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. అయితే కొంతమంది అధికారులు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
సూర్యాపేట జిల్లా హుజుర్నగర్ (Huzur Nagar)లో పంచాయతీ కార్యదర్శి బిల్లుల చెల్లింపు కోసం లబ్ధిదారుల నుంచి డబ్బులు డిమాండ్ చేశారు. ఈ విషయం మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి వరకు వెళ్లడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సదరు కార్యదర్శిని కలెక్టర్ సస్పెండ్ చేశారు. తాజాగా సిద్దిపేట (Siddipet) రూరల్ మండలం వెంకటాపూర్కు చెందిన మేస్త్రీని హౌసింగ్ ఏఈ వెంకన్న ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడు.
Indiramma Illu | ఇంటికి రూ.5 వేలు ఇవ్వాలని..
గ్రామానికి చెందిన వెంకటయ్య మేస్త్రీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. గ్రామంలో దాదాపు 18 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఆయన కాంట్రాక్ట్ పట్టుకున్నాడు. దీంతో ఏఈ వెంకన్న ఆయనకు ఫోన్ చేసి ఇంటికి రూ.5 వేల చొప్పున తనకు చెల్లించాలని డిమాండ్ చేసినట్లు బాధితుడు ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక వేళ డబ్బులు ఇవ్వకపోతే బిల్లులు మంజూరు చేయనని, ఇతర ఇల్లులు పట్టుకోకుండా చేస్తానని ఏఈ బెదిరించాడని బాధితుడు వాపోయాడు. కాగా ఈ విషయం తమ దృష్టికి రాలేదని జెడ్పీ సీఈవో రమేశ్ తెలిపారు. ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.